రైలు ప్రయాణికుల వీపు విమానం మోతే: ఒక్కో టికెట్పై రూ.35 వరకు: కేబినెట్ ఆమోదమే బ్యాలెన్స్
న్యూఢిల్లీ: రైలు ప్రయాణికుల వీపు ఇక విమానం మోత మోగబోతోంది. ప్రయాణికులపై యూజర్ ఛార్జీల భారాన్ని మోపడానికి రైల్వే మంత్రిత్వ శాఖ సన్నహాలు పూర్తి చేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలన్నింటినీ సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేసింది. వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలపై కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర లభించిన వెంటనే.. పెంచిన యూజర్ ఛార్జీలు అమల్లోకి వస్తాయి. కేబినెట్ ఆమోదం పొందిన వెంటనే విమానాశ్రయాల తరహాలోనే రైల్వేస్టేషన్లలోనూ యూజర్ ఛార్జీలను వసూలు చేస్తారు.
కాగ్ విమర్శించిందని.. మొత్తం నిబంధననే ఎత్తేసిన మోడీ సర్కార్: రక్షణ ఒప్పందాల్లో అనూహ్యం
రూ.10 నుంచి 35 వరకు
ఈ ప్రతిపాదనల ప్రకారం.. రైల్వే అధికారులు ఒక్కో టికెట్పై 10 నుంచి 35 రూపాయలను అదనంగా వసూలు చేస్తారు. యూజర్ ఛార్జీలు, లెవీల రూపంలో ప్రయాణికుల నుంచి వసూలు చేసిన అదనపు మొత్తాన్ని రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ కోసం వినియోగిస్తామని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇంతకుముందు కూడా యూజర్ ఛార్జీలను పెంచాలనే ప్రతిపాదనలు వచ్చినప్పటికీ.. వాటిని పరిమిత స్టేషన్లలో మాత్రమే అమలు చేస్తామంటూ రైల్వే అధికారులు వెల్లడించారు.
స్టేషన్ల ఆధునికీకరణ కోసమేనంటూ..
ఆధునికీకరణ, పునరుద్ధరించబోయే స్టేషన్లు, ప్రయాణికుల తాకిడి అధికంగా ఉండే స్టేషన్లలో జారీ చేసే టికెట్లపై మాత్రమే యూజర్ ఛార్జీలను వసూలు చేస్తామంటూ ఇదివరకు రైల్వే అధికారులు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి రైల్వే స్టేషన్లు 700 నుంచి 1000 వరకు ఉన్నాయి. ఈ సారి దీనికి భిన్నంగా యూజర్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను రూపొందించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ఉన్న ఏడువేల రైల్వేస్టేషన్లను ఈ ఛార్జీల పరిధిలోకి తీసుకుని వచ్చేలా అధికారులు తాజా ప్రతిపాదనలను తయారు చేసినట్లు తెలుస్తోంది.
విమానాశ్రయాల తరహాలోనే..
ప్రస్తుతం విమానాశ్రయాల్లో యూజర్ ఛార్జీలు అమల్లో ఉన్నాయి. యూజర్ డెవలప్మెంట్ ఫీ (యూడీఎఫ్) రూపంలో విమాన ప్రయాణికుల నుంచి ఈ ఛార్జీలను వసూలు చేస్తున్నారు. డొమెస్టిక్ ప్రయాణికులపై టికెట్ ఒక్కింటికి 184 రూపాయలు, అంతర్జాతీయ ప్రయాణికులపై 839 రూపాయల మేర యూజర్ డెవలప్మెంట్ ఫీ అమలులో ఉంటోంది. ఇదే తరహాలో రైల్వేస్టేషన్లలోనూ యూజర్ ఛార్జీలు అందుబాటులోకి రానున్నాయి. తొలిదశలో అత్యధిక రద్దీ, ప్రధాన స్టేషన్లలో యూజర్ ఛార్జీలను అమలు చేస్తారని, అనంతరం దశలవారీగా మరిన్ని స్టేషన్లకు విస్తరిస్తారని చెబుతున్నారు.
సామాన్య ప్రయాణికులపై భారం పడకుండా..
సామాన్య ప్రయాణికులపై భారం పడకుండా యూజర్ ఛార్జీలను అమలు చేస్తామని రైల్వే అధికారులు చెబుతున్నారు. ప్రారంభ ఛార్జీ 10 రూపాయలు మాత్రమే ఉంటుందని, సామాన్య ప్రయాణికులకు ఈ మొత్తం పెద్ద భారం కాబోదని అంటున్నారు. నామమాత్రమేనని భరోసా ఇస్తున్నారు. ఏసీ కోచ్లల్లో ప్రయాణించే వారిపై గరిష్ఠంగా 35 రూపాయలను వసూలు చేసేలా ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు వెల్లడిస్తున్నారు. రైల్వే స్టేషన్ల ఆధునికీకరణను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని, దీనికోసం ప్రయాణికుల నుంచి టోకెన్ అమౌంట్ రూపంలో నామమాత్రపు ఛార్జీలను వసూలు చేసేలా ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.