బడ్జెట్ వేళ రైల్వే శాఖ సంచలన ప్రతిపాదన.. ప్రయాణికులు ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందే..
ప్రయాణికులకు విజ్ణప్తి.. దయచేసి వినండి.. సామాన్యుడి రవాణా సాధనమైన రైళ్లలో.. ప్రయాణం ఇకపై చాలా మార్పులకు లోనుకానుంది.. తోటి ప్యాసింజర్లను ఇబ్బంది పెట్టేలా కాకిరిబీకిరిగా అరిచేవాళ్లు.. కన్నూమిన్నూ కానక అసభ్య, అనుచిత చర్యలకుదిగేవాళ్లు.. రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.. రైలులో ప్రయాణిస్తూ ఇతరులను తీవ్రంగా ఇబ్బందికి గురిచేసే వ్యక్తులపై నిషేధం విధించే దిశగా రైల్వే శాఖ సంచలన ప్రతిపాదన సిద్ధం చేస్తోంది.
నిబంధనల సవరణ..
రైలు ప్రయాణం అంటేనే అదో సందడి.. జనరల్ బోగీల్లోనైతే అరుపులు, కేకలు, సీట్ల కోసం కొట్లాటలు కామన్ గా కనిపిస్తాయి.. రిజర్వుడు బోగీల్లోనూ వాగ్వాదాలు, ముచ్చట్లకు కొదువుండదు. కొన్నిసార్లు విచక్షణ కోల్పోయి తోటిప్రయాణికులతో అనుచితంగా ప్రవర్తించడం.. చిన్న వాగ్వాదం పెరిగిపెద్దదై రైల్లో నుంచి తోసుకునేదాకా దారితీయడం.. చిచోరా గ్యాంగులు మహిళలపై లైంగికవేధింపులకు దిగడం లాంటి వార్తలు తరచూ చూస్తుంటాం. వాటికి చెక్ పెట్టడంతోపాటు బాధ్యులపై చర్యలు తీసుకునేలా రూల్స్ ను సవరించబోతున్నట్లు రైల్వే శాఖ ఉన్నతాధికులు తెలిపారు.
కునాల్ కమ్రా ఉదంతంతో..
స్టాండ్అప్ కమెడియన్ కునాల్ కమ్రాపై ఆరునెలల నిషేధం విధిస్తూ ఇండిగో ఎయిర్ లైన్స్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సరిగ్గా ఇదే తరుణంలో రైల్వే శాఖ కూడా ‘ప్రయాణికుల ప్రవర్తన'కు సంబంధించిన చర్చకు తెరలేపింది. రెండ్రోజుల కిందట ముంబై నుంచి లక్నో వెళ్తోన్న విమానంలో.. ప్రముఖ జర్నలిస్ట్, రిపబ్లిక్ టీవీ అధిపతి అర్నబ్ గోస్వామి పట్ల కునాల్ అనుచితంగా ప్రవర్తించారు. అర్నబ్ ను దళితద్రోహి, దేశద్రోహి అని వేధించడంతోపాటు వీడియో కూడా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కునాల్ చర్యను తప్పుపట్టిన ఇండిగో ఎయిర్ లైన్స్ ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఇంకొన్ని విమానయాన సంస్థలు కూడా కమెడియన్ ను నిషేధించే అవకాశాలున్నాయి. రైల్వే అధికారులు కూడా ఈ ఉదంతంపై స్పందించారు.
బడ్జెట్లో చేర్చుతారా?
ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియాలో అమలవుతున్నట్లే రైల్వేల్లోనూ ‘అనుచితంగా ప్రవర్తించే వ్యక్తులపై నిషేధం' రూల్ ను తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఉన్న చట్టాలకు అదనంగా సెక్షన్లు జోడిస్తామని తెలిపారు. అయితే ఈ ప్రతిపాదనలను రేపటి బడ్జెట్ లో ప్రస్తావిస్తారా? లేదా? అన్న ప్రశ్నకు మాత్రం స్పష్టమైన సమాధానం చెప్పలేదు.
ముదురుతోన్న వివాదం..
కమెడియన్ కునాల్ కమ్రాపై ఇండిగో చర్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇదే అర్నబ్ గోస్వామికి చెందిన రిపబ్లిక్ టీవీ ప్రతినిధులు.. విమానాల్లో చాలా మందిని ఇబ్బంది పెట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బీజేపీ భోపాల్ ఎంపీ సాధ్వి ఠాకూర్ ఎయిర్ ఇండియా విమానంలో సీటు కోసం చేసిన రచ్చ తాలూకు వార్తలు మళ్లీ షేర్ అవుతున్నాయి. బీజేపీ సపోర్టర్లకు ఒక న్యాయం.. వ్యతిరేకులకు ఇంకో న్యాయమా? అని నెటిజన్లు నిలదీస్తున్నారు. రాజకీయాలు పక్కనపెడితే.. తోటి ప్రయాణికులను ఇబ్బందిపెట్టే ఎవరినైనా వదిలిపెట్టొదని సామాన్యులు వాదిస్తున్నారు.