రైల్వేల్లో భారీ మార్పులు - పాసింజర్ రైళ్లకు రాంరాం- ఇక అన్నీ ఎక్స్ ప్రెస్ లే- స్టాప్ లూ తగ్గింపు
వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న భారతీయ రైల్వేల్లో ఎన్నడూ లేని విధంగా భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో కోచ్ లు క్వారంటైన్లుగా మారిపోతున్న దృశ్యాలు చూస్తూనే ఉన్నాం. ఇదే కోవలో మరో కీలక నిర్ణయం దిశగా రైల్వే శాఖ అఢుగులేస్తోంది. ఇది విజయవంతమైతే ఇక దేశంలో పాసింజర్ రైళ్ల సంఖ్య భారీగా తగ్గిపోవడమో లేక పూర్తిగా మాయం కావడమో జరుగుతుందనే అంచనాలున్నాయి.
Recommended Video
చైనా కంపెనీల నెత్తిన భారత్ పిడుగు: ట్రేడ్ వార్: రూ.471 కోట్ల రైల్వే కాంట్రాక్టు పనులు రద్దు
పాసింజర్లకు మంగళం- అన్నీ ఎక్స్ ప్రెస్ లే...
వందేళ్ల పైబడిన భారతీయ రైల్వే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ మార్పులకు కారణమవుతున్న కరోనా వైరస్ ఈసారి సామాన్యులు ఎక్కువగా ఉపయోగించే పాసింజర్ రైళ్ల ఉనికికే ముప్పు తెచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు జోన్లలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రైళ్లను ఎక్స్ ప్రెస్ రైళ్లుగా, ఏసీ రైళ్లుగా మార్చేస్తున్న రైల్వేశాఖ త్వరలో పాసింజర్ రైళ్లకు మంగళం పాడేందుకు సిద్దమవుతుందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. జోన్ల వారీగా, దశల వారీగా ఈ ప్రక్రియను అమలు చేసేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇక తగ్గనున్న స్టాప్ లు..
పాసింజర్ రైళ్లను క్రమంగా ఎక్స్ ప్రెస్ లుగా మార్చే కార్యక్రమం మొదలుపెడితే ఇప్పుడున్న స్టాప్ ల సంఖ్య కూడా భారీగా తగ్గిపోనుంది. ప్రస్తుతం పాసింజర్ రైళ్లు ప్రయాణ మార్గంలో దారి పొడవునా దాదాపు ప్రతీ గ్రామాన్నీ కవర్ చేస్తూ వెళ్తున్నాయి. అదే పాసింజర్ రైళ్లు ఎక్స్ ప్రెస్ లుగా మారిపోతే ఇక ఈ స్టాప్ లకు మంగళం పాడక తప్పదు. ఎక్స్ ప్రెస్ రైళ్లుగా మార్చే క్రమంలో ప్రయాణికుల సౌలభ్యాన్ని, ఇతరత్రా కారణాలను దృష్టిలో ఉంచుకుని స్టాప్ లను తగ్గించక తప్పని పరిస్ధితి ఏర్పడుతుంది.
తొలి దశలో 200 కి.మీ దాటిన వాటికే..
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే వివిధ స్టేషన్ల మధ్య దాదాపు 62 పాసింజర్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇందులో సికింద్రాబాద్-రేపల్లె, విజయవాడ-విశాఖ, గంటూరు-డోన్, విశాఖ-మచిలీపట్నం, కర్నూలు-తిరుపతి, గుంతకల్-హైదరాబాద్ వంటి పాపులర్ సర్వీసులు ఇందులో ఉన్నాయి. వీటి మధ్య ప్రయాణించే 62 పాసింజర్ రైళ్లు ఇక ఎక్స్ ప్రెస్ సర్వీసులుగా మారే అవకాశముంది. అలాగే 200 కి.మీ దాటిన అన్ని పాసింజర్ సర్వీసులను ఎక్స్ ప్రెస్ సర్వీసులుగా మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది విజయవంతమైతే మిగతా రైళ్లు కూడా ఎక్స్ ప్రెస్ లుగా మారిపోతాయి.
ఇక జీరో బేస్ట్ టైమ్ టేబుల్...
రైలు ప్రయాణాల్లో తాజాగా చోటు చేసుకుంటున్న మార్పుల ప్రకారం టైమ్ టైబుల్ ను కూడా సమూలంగా మార్చేందుకు రైల్వేశాఖ సిద్ధమవుతోంది. ముఖ్యంగా ప్రయాణాల్లో జాప్యాన్ని నివారించేందుకు వీలుగా జీరో బేస్ట్ టైమ్ టైబుల్ రూపకల్పన చేయనున్నారు. సరకు రవాణా రైళ్లతో ప్రయాణికుల రైళ్లకు ఎదురవుతున్న ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రధానంగా ఈ మార్పులు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే రైలు ప్రయాణ సమయాలు కూడా గణనీయంగా తగ్గిపోతాయని అధికారులు చెబుతున్నారు.