రైల్వే ప్రయాణికులకు శుభవార్త - దసరాకు 392 ప్రత్యేక రైళ్లు - 41 రోజుల పాటు...
ఈ ఏడాది దసరా సీజన్లో స్వస్ధలాలకు వెళ్లే వారికి రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. దసరా సీజన్ సందర్భంగా ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. దేశవ్యాప్తంగా వివిధ జోన్లలో 392 ప్రత్యేక రైళ్లు నడపాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ రైళ్లు ఏయే ప్రాంతాల మధ్య, జోన్ల మధ్య నడపాలనేది ఆయా జోన్లకే వదిలేశారు.
Recommended Video
దసరా సీజన్ రద్దీ దృష్ట్రా ఈ నెల 20 నుంచి వచ్చే నెల 30 వరకూ ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. వివిధ జోన్ల పరిధిలో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. మొత్తం 392 రైళ్లను నడపాలని నిర్ణయించిన అధికారులు.. 196 రూట్లలో వీటికి అనుమతిస్తారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మార్చి నెలలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ఆ తర్వాత అన్లాక్ ప్రక్రియ మొదలయ్యాక క్రమంగా రాకపోకలు మొదలయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల మధ్య కేవలం 666 సర్వీసులను మాత్రమే రైల్వేశాఖ నడుపుతోంది. వీటిలో ప్రత్యేక ఛార్జీలతో పాటు కరోనా ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు.
ఇప్పుడు దసరా సీజన్కు నడుపుతున్న ప్రత్యేక రైళ్లలోనూ అదనపు ఛార్జీలు వసూలు చేసేందుకు రైల్వేశాఖ సిద్ధమవుతోంది. ఈ రైళ్ల రాకపోకల షెడ్యూల్ను కూడా రైల్వేశాఖ విడుదల చేసింది. వీటి ఆధారంగా ఐఆర్సీటీసీ వెబ్సైట్తో పాటు రైల్వేస్టేషన్లలోనూ అడ్వాన్స్ బుకింగ్కు అవకాశం కల్పిస్తున్నారు. ఈ ప్రత్యేక రైళ్లన్నీ గంటకు 55 కిలోమీటర్ల వేగంతో మాత్రమే నడుపుతారు. కరోనా కారణంగా ప్రకటించిన అన్ని ఆంక్షలు అమలు మాత్రం తప్పనిసరి చేయనున్నారు.