మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పొంచివున్న గండం..పోలింగ్ శాతం తగ్గే ఛాన్స్?
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల యుద్ధం ఆరంభమైంది. అయిదేళ్ల పాటు అధికారంలో ఎవరు ఉండాలనే విషయాన్ని శాసించే ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 288 మంది సభ్యుల సంఖ్యా బలం ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో మొత్తం 3237 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మొన్నటిదాకా అధికారంలో కొనసాగిన భారతీయ జనతాపార్టీ-శివసేన, ప్రతిపక్షంలో కూర్చున్న కాంగ్రెస్-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మధ్యే పోటీ నెలకొని ఉంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు వాన గండం పొంచి ఉంది.
భారీ వర్షాలకు ఛాన్స్..
మహారాష్ట్ర పశ్చిమ ప్రాంతంలో సోమవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తుందని అంచనా వేశారు. భారీ వర్షాల ప్రభావం పోలింగ్ శాతంపై పడే అవకాశాలు లేకపోలేదు. ప్రత్యేకించి- కొల్హాపూర్, సతారా, సాంగ్లి, నాశిక్, పుణే, రత్నగిరి, ఔరంగాబాద్, రాయగఢ్, షోలాపూర్, బీడ్, ఉస్మానాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కొల్హాపూర్, సతారా జిల్లాల్లో ఆదివారం కూడా భారీ వర్షాలు పడ్డాయి. రాత్రి వరకూ ఏకధాటిగా కురిసిన వర్షం వల్ల పోలింగ్ కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది.
మరాఠ్వాడా, విదర్భల్లో ఓకే
ఈ రెండు జిల్లాల్లోని మారుమూల గ్రామాల్లో పోలింగ్ సామాగ్రిని చేరవేత పనులకు వర్షం వల్ల అంతరాయడం ఏర్పడింది. కొన్ని గ్రామాలకు అర్ధరాత్రి కూడా పోలింగ్ సామాగ్రిని చేరవేసినట్లు తెలుస్తోంది. కాగా.. అదే పరిస్థితి ఆయా జిల్లాల్లో సోమవారం కూడా కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర ఉత్తర ప్రాంతంతో పాటు విదర్భ, మరాఠ్వాడల పరిధిలోని జిల్లాల్లో వర్షం కురిసే జాడలు లేవని పేర్కొన్నారు. ఆయా చోట్ల పోలింగ్ కు అంతరాయం ఉండదని, క్యూలైన్ లో ఉన్న వారికి గడువు ముగిసిన తరువాత కూడా ఓటు వేయడానికి అవకాశం కల్పిస్తారు.
24 గంట్లలో భారీ వర్షపాతం
ముంబై ప్రాంతీయ వాతావరణ విభాగం అంచనా ప్రకారం.. ఆదివారం రాత్రి వరకూ కొల్హాపూర్, సతారా జిల్లాల్లో అంచనాలకు మించిన వర్షం కురిసింది. కొల్హాపూర్ లో 46, సతారాలో 89, పర్భణీలో 96, పుణేలో 38 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదిలా వుండగా మహారాష్ట్రలో మొన్నటిదాకా బీజేపీ-శివసేన కూటమి అధికారంలో కొనసాగింది. వరుసగా రెండోసారి కూడా అధికారంలోకి వస్తామని బీజేపీ-శివసేన నాయకులు చెబుతుండగా.. ఆ అవకాశం ఇవ్వబోమని కాంగ్రెస్-ఎన్సీపీ నాయకులు అంటున్నారు. ఆ కూటమి హయాంలో చోటు చేసుకున్న అవకతవకలను ప్రధాన అస్త్రంగా చేసుకుని కాంగ్రెస్-ఎన్సీపీ అందలం ఎక్కేలా ఎన్నికల్లో ప్రచార పర్వాన్ని కొనసాగించింది.