Amphan cyclone: బెంగాల్, ఒడిశాలో ఈదురుగాలులు, వర్ష బీభత్సం, ఏపీలోనూ..
కోల్కతా/భువనేశ్వర్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఆంఫన్ తుఫాను పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల తీర ప్రాంతాలను అతలాకుతలం చేస్తోంది. భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటికే అధికారుల హెచ్చరికలతో తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.
ఈదురు గాలులు, ఉవ్వెత్తున అలలు..
బుధవారం సాయంత్రం 4-6 గంటల సమయంలో దిగా, హతియా దీవుల వద్ద అంపన్ తుఫాను తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్రంలో 4-5 మీటర్ల ఎత్తులో ఎగిసిపడుతున్న అలలు పశ్చిమబెంగాల్లోని తీర ప్రాంతాలను ముంచెత్తే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్రా తెలిపారు.
సురక్షిత ప్రాంతాలకు లక్షల మంది..
తుఫాను తీరం దాటే సమయంలో గంటకు దాదాపు 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. కాగా, ఇప్పటికే ఒడిశాలోని తీర ప్రాంతాల్లోని 1.3 లక్షల మందిని, పశ్చిమబెంగాల్లోని తీర ప్రాంతాల్లోని 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
నేవీ, ఎన్డీఆర్ఎఫ్ సిద్ధం..
ప్రస్తుత తుఫాను ఒడిశాలోని పారాదీప్ తీరానికి 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. కాగా, భారత నేవీ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ప్రజలకు సహాయం అందించేందుకు ఇప్పటికే నేవీతోపాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రభావిత ప్రాంతాల్లో సిద్ధంగా ఉన్నారు. తుఫాను ప్రభావంతో కోల్కతా అంతర్జాతీయ విమానాశ్రయంలోని అన్ని కార్యకలాపాలు గురువారం సాయంత్రం వరకు రద్దు చేశారు.
తమిళనాడు, ఏపీలోనూ తుఫాను ఎఫెక్ట్..
తుఫాను ప్రభావం తమిళనాడుతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలపై కూడా ఉండనుంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఈదురుగాలులు వర్షాలు కురుస్తున్నాయి. సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించారు అధికారులు. కాగా, తెలంగాణపై ఈ తుఫాను ప్రభావం లేదని వాతావరణ అధికారులు తెలిపారు.