Rains: సెకనుకు లక్షా 50 వేలు, కసితో హెగ్నెకల్ వెళ్లిన కావేరి, రెడ్ అలర్ట్, ఆంధ్రా బార్డర్ లో ఆరంజ్!
చెన్నై/ బెంగళూరు/ హోగ్నెకల్ ఫాల్స్: ప్రతి ఏడాది నువ్వా ? నేనా ? అంటూ నీళ్ల కోసం పోట్లాడుకునే తమిళనాడు- కర్ణాటక రాష్ట్రాలు ఇప్పుడు సైలెంట్ అయిపోయాయి. నైరుతీ ప్రభావంతో పశ్చిమ పర్వత శ్రేణుల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. ఈ దెబ్బకు కావేరీ నది ఉగ్రరూపం దాల్చింది. గత ఏడాది జూన్ నెల తరువాత ఇప్పుడు మెట్టూరు డ్యామ్ పరిసర ప్రాంతాల్లోని రైతులను కర్ణాటక కావేరీ తల్లి కరుణించడంతో సంతోషంతో తడిసి ముద్ద అవుతున్నారు. కర్ణాటకలోని కేఆర్ఎస్, కబిని జలాశయాల నుంచి లక్షల క్యూసెక్కుల నీళ్లు తమిళనాడులోని హెగ్నెకల్ వైపు కసితో పరవళ్లు తొక్కుతున్నాయి. ఇక ఆంధ్రా బార్డర్ లో ఆరంజ్ అలర్ట్ ప్రకటించారు.
Recommended Video
Gold smuggling: నేను ముద్దమందారం, ముట్టుకుంటే, రూ. 100 కోట్ల స్కామ్, నో బెయిల్, ఈడీ కస్టడీ!
ఏడాది క్రితం ఏజరిగిందంటే?
ప్రతినిత్యం కావేరీ జలాల కోసం తమిళనాడు- కర్ణాటక రాష్ట్రాల మద్య వివాదం జరుగుతూనే ఉంటోంది. గత సంవత్సరా కర్ణాటకలో భారీగా వర్షాలు పడటంతో కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకు భారీ మొత్తంలో కావేరీ నీరు విడుదల చేసింది. గత ఏడాది జూన్ 12వ తేదీన మెట్టూరు (తమిళనాడు) జలాశయం గేట్లు ఎత్తేయడంతో ధర్మపురి, సేలం జిల్లాలతో పాటు ఆ పరిసర ప్రాంతాల్లోని రైతులు చాలా సంతోషంగా వ్యవసాయం చేసుకున్నారు. రైతుల సాగు నిమిత్తం అప్పట్లో మెట్టూరు డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో రైతులు పండగ చేసుకున్నారు.
అన్నదాతల ఆనందం
ప్రస్తుతం మెట్టూరు డ్యామ్ లో నీటి మట్టం 70 అడుగులు ఉంది. ఈ ఏడాది సాగు కోసం నీళ్లు వదులుతారా ? లేదా ? అని ఎదురు చూస్తున్న తమిళనాడు అన్నదాతలకు గుడ్ న్యూస్ వచ్చింది. కర్ణాటకలో భారీ వర్షాలు పడటంతో తమిళనాడులోని రైతులకు అనందాన్ని నింపింది. ఇదే సమయంలో కర్ణాటకలోని కేఆర్ ఎస్, కబిని జలాశయాల గేట్లు ఎత్తి వేయడంతో కావేరీ నదీ నీళ్లు పరవళ్లు తొక్కుతూ తమిళనాడు వైపుకు పరుగులు తీస్తోంది.
సెకనుకు లక్షా 50 వేలు
కర్ణాటకలోని కృష్ణరాజసాగర్ (KRS), కబిని డ్యామ్ ల్లోని కావేరీ నీరు బెంగళూరుకు తాగునీరు సరఫరా అవుంతోంది. మాకే తాగడానికి నీళ్లు చాలడం లేదు, మీకెక్కడి నుంచి కావేరీ నీళ్లు తెచ్చివ్వాలి అంటూ ఇన్ని రోజులు కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుతో పేచిపడుతూనే వస్తోంది. అయితే భారీ వర్షాల దెబ్బకు ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కేఆర్ఎస్, కబిని జలాశయాల గేట్లు ఎత్తేయడంతో తమిళనాడుకు సెకను లక్షా యాభై వేల గణపుటడుగుల నీరు వెలుతోంది.
కలకలాడుతున్న హోగ్నెకల్ వాటర్ ఫాల్స్
కావేరీ నీళ్లు పరవళ్లు తొక్కడంతో తమిళనాడులోని హోగ్నెకల్ జలాశయాలు కలకలాడుతున్నాయి. హోగ్నెకల్ జలాశయాలను కావేరీ నదీ నీళ్లు ముంచెత్తాయి. కావేరీ నదీ తీరంలో ఉన్న ధర్మపురి, సేలం జిల్లాల్లోని అన్నదాతలు, గ్రామీణ ప్రజలు పరవళ్లు తొక్కుతున్న కావేరీ నీటిని చూస్తూ పులకించిపోతున్నారు. అయితే ఇదే సమయంలో తమిళనాడు ప్రభుత్వం ధర్మపురి, సేలం జిల్లాల్లోని గ్రామీణ ప్రజలు కావేరీ నదీ నీళ్లు ప్రవహిస్తున్న ప్రాంతాల వైపు వెళ్లకూడదని ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది.
నీలగిరిలో రెడ్ అలర్ట్, ఆంధ్రా బార్డర్ లో ఆరంజ్
తమిళనాడులోని ప్రసిద్ది చెందిన పర్యాటక కేంద్రం నీలగిరి జిల్లాలో భారీ వర్షాల దెబ్బకు కొండల్లోని మట్టి చరియలు విరిగిపడుతున్నాయి. నీలగిరి జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ఆ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తమిళనాడు ప్రభుత్వం హెచ్చరించింది. ఇదే సమయంలో నీలగిరి జిల్లాతో పాటు కోయంబత్తూరు (కోవై), తేని జిల్లాల ప్రజలను జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. భారీ వర్షాలు కురుస్తున్న నీలగిరి, తేని, కోయంబత్తూరు జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇదే సయంలో ధర్మపురి, సేలం, దిండుగల్, తంజావూర్, క్రిష్ణగిరి, నాగపట్నం, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని వేలూరు జిల్లాల్లో ఆరంజ్ అలర్ట్ ప్రకటించారు.