ఢిల్లీపై కరుణ చూపిన వరుణ దేవుడు.. ఎండవేడిమి నుంచి నగరవాసులకు ఊరట
ఢిల్లీ: దేశంలో రుతుపవనాలు ప్రవేశించి పలు రాష్ట్రాల్లో వర్షాలు ముంచెత్తుతుండగా.. ఇంకా పలు రాష్ట్రాల్లో వరుణ దేవుడు కరుణ చూపలేదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా అంతంత మాత్రమే వర్షాలు కురిశాయి. ఇన్ని రోజులు భానుడి తాపానికి ఉడికిపోయిన ఢిల్లీ వాసులపై వరుణ దేవుడు దయచూపాడు. ఎట్టకేలకు ఢిల్లీ నేల వర్షపు నీటితో తడిసి ముద్దయింది. ఇప్పటి వరకు ముంబైలోనే భారీ వర్షాలు కురవగా గురువారం రోజున ఢిల్లీని కూడా వర్షం పలకరించింది.
ఇప్పటికే ఢిల్లీపై భానుడు ఉగ్రరూపం దాల్చాడు. ఒకానొక సందర్భంగలో దేశరాజధానిలో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెల్సియస్ను కూడా తాకాయి. ఒక్కసారిగా ఢిల్లీ నగరంతో పాటు గురుగ్రామ్, నోయిడా ప్రాంతాలను మబ్బలు కమ్మేయడంతో వర్షం వస్తుందన్న ఆశతో ఢిల్లీ వాసులు ఎదురు చూశారు. అనుకున్నట్లుగానే వారి ఆశలు నెరవేరాయి. ఒక్కసారిగా వర్షం కురవడంతో ఇళ్లలోనుంచి బయటకు వచ్చిన నగరవాసులు సంతోషంతో వర్షంలో తడిసి ముద్దయ్యారు. వర్షాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసి తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఇక రానున్న రోజుల్లో హర్యానా, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
ఢిల్లీలో వాతావరణం కొద్దిరోజుల పాటు అంటే జూలై 8 లేదా 9వ తేదీవరకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. తేలికపాటి వర్షాలు కూడా నగరవాసులకు ఎండవేడిమి నుంచి ఊరటనిస్తాయని వారు వివరించారు. ఎట్టకేలకు ఢిల్లీని వర్షం తాకిందంటూ, రుతుపవనాలు ఢిల్లీని తాకినందుకు ఆనందంగా ఉందంటూ కొందరు నెటిజెన్లు పోస్టు చేశారు. దేవుడు ఢిల్లీపై కరుణించాడని నగరంలో వర్షం కురుస్తోందంటూ మరొకరు ట్వీట్ చేశారు. ఈ సీజన్లో తొలకరి చినుకులు పలకరించాయని మరో వ్యక్తి ట్వీట్ చేశారు.
Finally monsoon hit Delhi NCR- first rain of this season pic.twitter.com/WL5pAuvPlp
— Jayant Thakur (@jayantthakur77) July 4, 2019