12పెళ్లి చూపులు.. ఏ అమ్మాయి ఇష్టపడలేదు: చివరికి పక్కింటి అమ్మాయిపై అఘాయిత్యం
రాయ్పూర్: చత్తీస్గఢ్ రాష్ట్రం మురేథి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి కావడం లేదన్న ఆగ్రహంతో పక్కింటి అమ్మాయిని చంపేశాడో యువకుడు. ఆమె చేతబడి చేయడం వల్లే తనకు పెళ్లి కుదరడం లేదని అనుమానించి హత్య చేశాడు.
నిందితుడిని పింటూగా గుర్తించారు. ఇప్పటిదాకా 12సార్లు పెళ్లి చూపులకు వెళ్లిన అతనికి.. ఎక్కడా ఏ సంబంధమూ కుదరలేదు. అమ్మాయిలంతా అతన్ని తిరస్కరిస్తూ వస్తున్నారు. కొన్నిసార్లు నిశ్చితార్థం దాకా వచ్చి కూడా ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి.
తనకు పెళ్లి కాకపోవడానికి ఎవరో చేతబడి చేయడమే కారణమని పింటూ భావించాడు. తన పక్కింట్లో ఉండే అమెరికా పటేల్ అనే యువతి తనకు చేతబడి చేసిందని అనుమానించాడు. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న అతను.. ఓరోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో అమెరికా పటేల్ పై దాడి చేశాడు.
మొదట ఓ కర్రతో ఆమెపై దాడి చేసిన పింటూ.. ఆపై చున్నీతో ఆమె గొంతు నులిమి చంపేశాడు. హత్యానంతరం అక్కడినుంచి పరారయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పింటూ కోసం గాలిస్తున్నారు. పింటూ బీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడని తెలిపారు.