రైల్వే ట్రాక్పై రాయపూర్ మోడల్ శవం, హత్యనా?
ఇండోర్: కుళ్లిపోయిన స్థితిలో ఓ మోడల్ శవం మందసౌర్ జిల్లాలోని గారోత్ వద్ద రైల్వే ట్రాక్పై బుధవారంనాడు కనిపించింది. మృతురాలిని 36 ఏళ్ల రాయపూర్కు చెందిన మోడల్ అనితా కార్వాడేగా గుర్తించారు. ఆ తర్వాత ఆమె జర్నలిస్టుగా కూడా పనిచేశారు.
ఆమెకు ఎనిమిది నెలల కూతురు, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. వారు రాయపూర్లో ఉంటున్నారు. శవం పూర్తిగా కుళ్లిపోవడంతో ఆమె అంత్యక్రియలను గారోత్లోనే జరిపారు.
అనితా కర్వాడే జూడో కరాటే బ్లాక్ బెల్టు హోల్డర్ కూడా. ఎన్సిసి క్యాడెట్ అయిన ఆమె మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓ ఎక్స్ప్రెస్ రైలు ఉదయం 5.25 నిమిషాలకు గారోత్ మీదుగా వెళ్లింది. ఆమె శవం ఉదయం 7 గంటలకు కనిపించింది.
ఆమె హ్యాండ్ బ్యాగ్ ఆమె శవం పడి ఉన్న స్తలానికి అర కిలోమీటరు దూరంలో కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ఆ బ్యాగులో ఉన్న మొబైల్ సాయంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
లభాంశ్ గోల్డ్ ఫిల్మ్ ప్రొడక్షన్ కార్యాలయం అద్దె చెల్లించడానికి ఆమె జైపూర్ ప్రయాణమయ్యారు. ఆ తర్వాత ఆమె బికనూర్ వెళ్లాల్సి ఉంది. ఆమె లగేజీ అదృశ్యమైంది. దీంతో ఆమె హత్యకు గురై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. రిజర్వేషన్ లేకుండా ఆమె అంత దూరం ప్రయాణించడానికి సిద్ధపడడం వెనక గల కారమేమటనేది మిస్టరీగా మారింది.
అనితా కర్వాడే మంగళవారం ఉదయం 7 గంటలకు షాలీమార్ ఎక్స్ప్రెస్ ఎక్కారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటిగంటన్న సమయంలో నాగపూర్లో దిగి, మధ్యాహ్నం 2.55 గంటలకు మన్నార్గాడి ఎక్స్ప్రెస్ లేడీస్ కోచ్లో ఎక్కారు. ఈ కోచ్ నుంచే ఆమె లగేజీ కనిపించకుండా పోయింది. రాత్రి 9 గంటలకు తాను ప్రయాణిస్తున్న రైలు ఇతార్సి స్టేషన్కు చేరుకున్నట్లు భర్త మనోజ్కు తెలిపింది.