భారత్ లో ఆన్ లైన్ ఓటింగ్ కు పెరుగుతున్న డిమాండ్లు: ఇదే మంచి తరుణమంటున్న నిపుణులు..
భారత్ లో ఆన్ లైన్ ఎన్నికల డిమాండ్ పాతదే అయినా వివిధ కారణాలతో ప్రభుత్వాలు, ఎన్నికల సంఘం తిరస్కరిస్తూ వచ్చాయి. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బయో మెట్రిక్ వాడేందుకు సైతం జనం భయపడుతున్న వేళ... ఆన్ లైన్ ఓటింగ్ డిమాండ్ తెరపైకి వస్తోంది. ఇకపై అన్ని ఎన్నికలను ఆన్ లైన్లో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తాజాగా పలువురు ప్రముఖులు కేంద్రాన్ని డిమా్ండ్ చేస్తున్నారు.
ఆన్ లైన్ ఎన్నికల డిమాండ్...
కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిన భౌతిక దూరంతో పాటు మరెన్నో అంశాలపై సాధారణ జనంలో అవగాహన పెరిగింది. వీటి ప్రభావం అన్ని రంగాలపైనా కనిపిస్తోంది. తాజాగా ఎన్నికల నిర్వహణ విషయంలోనూ భౌతిక దూరం నిబంధనలపై అవగాహన పెంచాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇదే కోవలో గతంలో బ్యాలెట్ బాక్సులు, ఈవీఎం యంత్రాల ద్వారా నిర్వహించిన ఎన్నికలను ఈసారి ఆన్ లైన్లో నిర్వహిస్తే ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది. ఈ డిమాండ్ రాజకీయ నేతలతో పాటు బ్యూరోక్రాట్ల నుంచి కూడా వినిపిస్తోంది.
ఆన్ లైన్ ఓటింగ్ కు నేతలు సై....
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆన్ లైన్ ఓటింగ్ కు మళ్లడాన్ని బీహార్ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీతో పాటు అదనపు సొలిసిటర్ జనరల్ సత్యపాల్ జైన్ కూడా సమర్ధించారు. ఈ ఏడాది జరిగే ఎన్నికలు ఆన్ లైన్ లోనే నిర్వహిస్తే బావుంటుందని వీరు సూచించారు. ఈ ఏడాది నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలను కూడా ఆన్ లైన్లో నిర్వహించేందుకు అక్కడి ట్రంపు సర్కార్ పరిశీలిస్తున్న నేపథ్యంలో భారత్ లోనూ అదే పద్దతి పాటిస్తే బావుంటుందనే చర్చ సాగుతోంది. కాంగ్రెస్ నేత శశిధరూర్ కూడా ఈ వాదనను వ్యక్తిగతంగా తాను సమర్ధిస్తున్నట్లు చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ రూపంలో పరోక్ష ఓటింగ్ ఇప్పటికే అమల్లో ఉందని గుర్తుచేశారు.
బ్లాక్ చెయిన్ టెక్నాలజీపై ఈసీ దృష్టి...
కరోనా వైరస్ వ్యాప్తి భయాల నేపథ్యంలో వ్యక్తిగత హాజరీ లేకుండా పరోక్షంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ వర్గాలు చెప్తున్నాయి. తాజాగా ఎన్నికల నిర్వహణలో బ్లాక్ చెయిన్ టెక్నాలజీని వినియోగించుకునేందుకు వీలుగా ఐఐటీ చెన్నై సహకారం కోరినట్లు ఈసీ వర్గాలు వెల్లడించాయి. ఈ పరిజ్ఞానం వల్ల ఓటర్లు నియోజకవర్గాల బయట ఉన్నప్పటికీ ఉన్న చోటు నుంచే తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు వీలు పడుతుంది.
Recommended Video
సాధ్యాసాధ్యాలపై భిన్నాభిప్రాయాలు...
కరోనా భయాలతో ఆన్ లైన్ ఓటింగ్ కోసం ఓవైపు డి్మాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో దీని సాధ్యాసాధ్యాలపై అప్పుడే చర్చ మొదలైంది. ప్రస్తుత ఎన్నికల కమిషన్ బ్లాక్ చెయిన్ టెక్నాలజీ సాయంతో ఆన్ లైన్ లేదా పరోక్ష ఓటింగ్ కోసం ఉన్న అవకాశాలు పరిశీలిస్తున్నట్లు చెబుతుంటే మాజీ ఎన్నికల కమిషనర్ ఖురేషీ మాత్రం ఇది సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. అత్యంత సులువైన ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహిస్తుంటేనే పలు వివాదాలు చెలరేగుతున్న నేపథ్యంలో ఆన్ లైన్ ఓటింగ్ ద్వారా ఫలితాలు తారుమారు కాకపోయినా ప్రతికూల ఫలితాలు వచ్చినప్పుడు ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.