బ్యాలట్ పద్ధతి ద్వారా ఎన్నికలు నిర్వహించాలి..దీదీతో చేయికలిపిన రాజ్థాక్రే
కోల్కతా: ఈవీఎంలను రద్దు చేసి ఎన్నికల ప్రక్రియ బ్యాలట్ ద్వారానే నిర్వహించాలన్న డిమాండ్ 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచే వినిపిస్తోంది. ఇలా బ్యాలట్ పద్ధతిని తిరిగి ప్రవేశపెట్టాలంటూ కోరిన వారిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలు ముందువరసలో నిలిచారు. తాజాగా మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్థాక్రే కూడా డిమాండ్కు గొంతు కలిపారు. బ్యాలట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలనే అంశంపై కోల్కతాలో జరిగిన సమావేశంలో రాజ్థాక్రే మమతా బెనర్జీతో పాటు పాల్గొన్నారు.
బాంబే హైకోర్టు, సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘంపై తనకు విశ్వాసం లేదన్న రాజ్థాక్రే బ్యాలట్ పేపర్ల ద్వారా ఓటింగ్ జరగాలని డిమాండ్ చేస్తూ ఆగష్టు 21న తాను నిరసన తెలపనున్నట్లు వెల్లడించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఇతర విపక్షపార్టీల అధినేతలను కూడా పాల్గొనాల్సిందిగా తాను ఆహ్వానించనున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే మమతా బెనర్జీ రాజ్థాక్రేకు మద్దతు తెలుపుతూనే అదే సమయంలో ఆయన చేసే నిరసన కార్యక్రమంకు హాజరు కాబోరని సమాచారం. ఈ ఏడాదిలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బ్యాలట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఈ లోక్సభ ఎన్నికల నిర్వహణపై చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయని చెప్పిన రాజ్థాక్రే... అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈవీఎంలక స్వస్తి పలికి తిరిగి బ్యాలట్ ఓటింగ్కు వచ్చారని ఆయన గుర్తు చేశారు. మెషీన్లతో అన్నీ సవ్యంగా జరగవని ఆయన పేర్కొన్నారు. ఇక మహారాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది జరగనున్న ఎన్నికలకు తన పార్టీ తరపున మమతా బెనర్జీ ప్రచారం చేసేందుకు అంగీకరించారని రాజ్ థాక్రే చెప్పారు.