బజరంగీ బాయిజాన్! మోడీని భారత్ తీసుకు రా: రాజ్
ముంబై: ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనల పైన మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షులు రాజ్ థాకరే మండిపడ్డారు. విదేశాల్లో ఎక్కువ రోజులు ఉంటున్న తొలి ప్రధాని మోడీయేనని ఎద్దేవా చేశారు. మనం ఎలాంటి ప్రభుత్వాన్ని కలిగి ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
పని చేయడానికి బదులు... నిషేధం విధించే ప్రభుత్వం ఉందన్నారు. మనం తొలిసారి... ఎక్కువ రోజులు దేశం బయట ఉంటున్న ప్రధానిని చూస్తున్నామన్నారు. నటుడు సల్మాన్ ఖాన్ బజరంగీభాయీజాన్ పార్ట్ 2 సినిమా తీస్తున్నట్లుగా తాను వార్తలు విన్నానని చెప్పారు.
సల్మాన్ ఖాన్ తన తాజా చిత్రం ద్వారా విదేశాల్లో ఎక్కువ కాలం ఉంటున్న ప్రధాని మోడీని భారత్ తీసుకు రావాలని అభిప్రాయపడ్డారు.
ముంబై - అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు అవసరమా అన్నారు. మిగతా రాష్ట్రాల్లో ఎందుకు వద్దన్నారు. గుజరాత్ వెళ్లి అక్కడ చాయ్, ధోక్లా (ఆహార పదార్థం) దతినేందుకు బుల్లెట్ రైలు కావాలా అని ఎద్దేవా చేశారు. శివసేన - బిజెపిలు పబ్లిసిటీ కోసమే కొట్లాడుకుంటున్నాయని ఆరోపించారు.
వారిలా కనీసం భార్యాభర్తలు కూడా పోట్లాడుకోరన్నారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. తమ రెండు పార్టీల మధ్య (బిజెపి-శివసేన) అంతా బాగానే ఉందని చెబుతారని, అదే విషయం శివసేన మంత్రులతో చెప్పించాలన్నారు.
అచ్చే దిన్ (మంచి రోజులు) అని బిజెపి చెప్పిందని, కానీ కేవలం ఆ పార్టీ నేతలకే అచ్చేదిన్ అని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ గాయకుడిని ముంబై రావొద్దని హెచ్చరించిన శివసేనను రాజ్ థాకరే సమర్థించారు. మన దేశంలో టాలెంట్ ఉన్నవారు చాలామంది ఉన్నారని చెప్పారు. అలాంటప్పుడు విదేశీయులు ఎందుకన్నారు.