మహారాష్ట్రలో మట్టికరిచిన ఎమ్మెన్నెస్ : రాజ్ ఠాక్రే రంగంలోకి దిగిన ఆదరించని ప్రజలు
ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో స్థానికత పేరుతో హల్చల్ చేస్తోన్న మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన లోక్సభ ఎన్నికల్లో పత్తాలేకుండా పోయింది. ఆ పార్టీ చీఫ్ రాజ్ ఠాక్రే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇప్పుడే కాదు ఏ ఎన్నికల్లో కూడా ఆయన బరిలోకి దిగిన దాఖలాలు లేవు. కానీ ఆయన పార్టీ అభ్యర్థులు ఒక్కరూ కూడా ఖతా తెరవలేదు.
బీజేపీ దూకుడు ..
లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీకి శృంగభంగం తప్పలేదు. ఎమ్మెన్నెస్ కోసం రాజ్ ఠాక్రే జోరుగా ప్రచారం చేశారు. టెక్నాలజీని ఉపయోగించారు. పాత తరం వారి కోసం కూడా మూస పద్ధతిలో రణరంగంలోకి దిగారు. బీజేపీకి వ్యతిరేకంగా ర్యాలీలు తీశారు. 10 నియోజకవర్గాల్లో జరిగిన తప్పులను ఎత్తిచూపుతూ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఏం జరగలేదు ? వార్త పత్రికల్లో వచ్చిన అంశాలను కత్తిరించి, ఆడియో, వీడియో క్లిప్పింగులను చూపించినా ఫలితం లేకపోయింది. ప్రచారం సందర్భంగా రాజ్ ఠాక్రే లేవనెత్తిన అంశాలను ప్రజలు పట్టించుకున్నారే తప్ప ఓటు మాత్రం వేయలేదు. రాష్ట్రంలో ప్రతిపక్షంగా పనిచేసినా ఫలితం లేకుండా పోయింది.
ఒక్క చోట కూడా ..
దాదాపు 10 నియోజకవర్గాలపై ఎమ్మెన్నెస్ ఫోకస్ చేసింది. ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించింది. ముఖ్యంగా నాందేడ్, షోలాపూర్, కోల్హాపూర్, సాతారా, పుణే, రాయ్ గఢ్, మావల్, నాసిక్, ముంబై సౌత్, ముంబై వెస్ట్ పై ఠాక్రే దృష్టిసారించారు. తాము చేపట్టే ర్యాలీలు కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలకు మేలు చేస్తాయని ఒకానొక క్రమంలో ఎమ్మెన్నెస్ భావించింది. కానీ అలా కూడా జరగలేదు. బీజేపీ వేవ్లో కాంగ్రెస్, ఎన్సీపీ, ఎమ్మెన్నెస్ కొట్టుకుపోయాయి.
నాందేడ్లో కూడా ..
కాంగ్రెస్ పార్టీ సురక్షితమైన సీటు నాందేడ్ లో కూడా మట్టికరిచింది. మాజీ సీఎం అశోక్ చవాన్ పై బీజేపీ నేత ప్రతాప్ చికాలికర్ విజయం సాధించారు. ఇదేవిధంగా మావల్ స్థానంలో కూడా పరాజయం తప్పలేదు. ముంబైలో కూడా ఎలాంటి ప్రభావం చూపలేదు. కాంగ్రెస్, ఎన్సీపీ, ఎమ్మెన్నెస్ అభ్యర్థులు వరసగా ఓటమిని చవిచూశారు.