బిజెపి అంటే.., ఎవరడిగినా చేస్తారా: రాజ్ థాకరే చురక
ముంబై: బిజెపి అంటే భారతీయ జనతా పార్టీ కాదని భారతీయ జంతు పక్ష్ అని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షులు రాజ్ థాకరే ఎద్దేవా చేశారు. ముంబైలో మాంసం నిషేధం పైన ఆయన విమర్శలు గుప్పించారు.
బీజేపీలోని జనతా (భారతీయ జనతా పార్టీ) అంటే కేవలం జైనులే కాదన్నారు. బీజేపీ అంటే భారతీయ జంతు పక్ష్ పార్టీగా మారిందన్నారు. ముంబైలో ప్రజలు ఏం చేయాలన్న దానిని కేవలం జైనులే నిర్ణయించలేరు కదా అని ప్రశ్నించారు.
రేపు మరో వర్గానికి చెందిన ప్రజలు తమ పండగను పురస్కరించుకుని దుకాణాలన్నీ మూసేయాలని కోరితే అలాగే చేస్తారా? అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోవాలన్నారు. బీజేపీ చర్యల వల్ల జైనులకు హిందువులు వ్యతిరేకం అనే అర్థం వస్తోందన్నారు. తక్షణం ప్రభుత్వ తన నిర్ణయాన్ని సమీక్షించుకోవాలన్నారు.
కాగా, ఉత్తరాది వారిని, బిహారీ అల్పసంఖ్యాక వర్గాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ థాకరేకు ఢిల్లీ హైకోర్టు గురువారం ఉపశమనం కల్పించిది. ఆయన పైన జారీ అయిన సమన్లను, ఎఫ్ఐఆర్ను కొట్టేసింది.