వారిపై సమాచారమివ్వండి...క్యాష్ ప్రైజ్ గెలుచుకోండి: రాజ్థాక్రే ఇస్తున్న ఆఫర్ ఏంటి..?
ముంబై: దేశ వ్యాప్తంగా సీఏఏపై నిరసనలు జరుగుతున్న క్రమంలో కొన్ని పార్టీలు విషయాన్ని మరింత వివాదాస్పదంగా మారుస్తున్నాయి. ఇప్పటి వరకు చాలా సైలెంట్గా ఉన్న మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన ముంబై ప్రజలకు ఆఫర్ ఇచ్చింది. అక్రమవలసదారులపై ఈ మధ్యకాలంలో దృష్టి సారించిన రాజ్థాక్రే పార్టీ బంగ్లాదేశ్.. పాకిస్తాన్ వలసదారులపై సమాచారం ఇచ్చిన వారికి క్యాష్ ప్రైజ్ ప్రకటించింది.
ఢిల్లీ అల్లర్లతో ఓ వైపు దేశం కదిలిపోతుంటే.. మరోవైపు రాజ్థాక్రే పార్టీ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) ముంబై ప్రజలకు ఓ ఆఫర్ ప్రకటించింది. బంగ్లాదేశ్ పాకిస్తాన్ల నుంచి వచ్చిన వలసదారుల సమాచారం తమకు ఇస్తే నగదు బహుమానం ప్రకటించింది. ఈ మేరకు ముంబైలోని బాంద్రా ప్రాంతంలో పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. అక్రమ వలసదారులకు సంబంధించిన సమాచారం ఇచ్చిన వ్యక్తికి రూ.5555 బహుమానంగా ఇస్తామంటూ పోస్టర్లు ముద్రించింది. ఇక త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న ఔరంగాబాద్లో కూడా ఇలాంటి పోస్టరే ఒకటి వెలిసింది. అయితే ఇక్కడ క్యాష్ ప్రైజ్ రూ.5వేలు అని మాత్రమే రాసి ఉంది.
ఈ మధ్యనే రాజ్థాక్రే తన పార్టీ జెండా రంగును మార్చారు. పూర్తిగా కాషాయం రంగులోకి పార్టీ జెండాను మార్చారు రాజ్థాక్రే. మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సందిగ్ధత నేపథ్యంలో హిందూభావజాలం ప్రస్పుటించేలా తన అజెండాను మార్చుకున్నట్లు సమాచారం. హిందూత్వ భావజాలం ఉన్న బీజేపీని వీడి రెండు సెక్యులర్ పార్టీలతో శివసేన మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీన్నే అదనుగా మలుచుకున్న రాజ్థాక్రే పార్టీ ఎంఎన్ఎస్ బీజేపీకి దగ్గరయ్యేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే పార్టీ జెండా రంగును కాషాయంలోకి మార్చడం చర్చనీయాంశమైంది.
ఢిల్లీ తగలబడి పోతోంటే అమిత్ షా కనిపించరు, నిజం మాట్లాడితే కోర్టును శిక్షిస్తారా..?: శివసేన
ఇక అక్రమవలసదారులను గుర్తించడంలో మోడీ ప్రభుత్వానికి సహకరిస్తామని ఈ మధ్యకాలంలోనే ఎంఎన్ఎస్ ప్రకటించింది. అంతేకాదు బంగ్లాదేశీయులు భారత్ను వీడి వెళ్లిపోవాలంటూ పోస్టర్లను కూడా అతికించింది. సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లపై కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానపరమైన నిర్ణయాల నేపథ్యంలో ఎంఎన్ఎస్ ఈ ప్రచారం చేయడం చర్చనీయాంశమైంది.
Recommended Video
ఇప్పటికే ఢిల్లీ అలర్లలో 38 మంది మృతి చెందారు. సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్న వారిని క్లియర్ చేయకపోతే.. తానే స్వయంగా రోడ్లపైకి వస్తానని ఢిల్లీ పోలీసులకు కపిల్ మిశ్రా హెచ్చరించడంతో వివాదం ముదిరింది. ఈ క్రమంలోనే విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసిన కపిల్ మిశ్రాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. దీంతో ఓ జడ్జిని బదిలీ కూడా చేయడం వివాదాస్పదంగా మారింది.