ఆసక్తి: రాజ్ ఠాక్రే ఇంటిలో కమల్ హాసన్
ముంబై: విలక్షణ నటుడు, నిర్మాత, దర్శకుడు కమల్ హాసన్ మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రేని కలిశారు. వీరిద్దరి కలయిక ఇటు సినీరంగంలో, అటు రాజకీయరంగంలో తీవ్ర చర్చకు దారి తీసింది.
శుక్రవారం ముంబైలోని కృష్ణకుంజ్ లోని రాజ్ ఠాక్రే ఇంటికి వచ్చిన కమల్ హాసన్ ను సాదరంగా స్వాగతించారు. రాజ్ ఠాక్రే కుటుంబ సభ్యులు ద్వారం దగ్గరే కమల్ హాసన్ ను మరాఠా సాంప్రదాయ రీతిలో అహ్వానించారు. రాజ్ ఠాక్రే బంగారు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.
రాజ్ ఠాక్రే భార్య షర్మిల కమల్ హాసన్ కు నమస్కారం చేశారు. రాజ్ ఠాక్రే కుమార్తె ఊర్వశి పుష్పగుచ్చం అందించి పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. తరువాత రాజ్ ఠాక్రే, కమల్ హాసన్ చాలసేపు చర్చించుకున్నారు.
ఇది కేవలం మర్యాదపూర్వక భేటి మాత్రమే అని మహారాష్ట్ర నవనిర్మాణ సేన నాయకులు చెప్పారు. అయితే కమల్ హాసన్ త్వరలో రాజకీయాలలోకి వస్తున్నారని వార్తలు గుప్పుమన్నాయి. ఇటు బాలీవుడ్ వర్గాలు మాత్రం కమల్ రాజకీయాలలోకి రారని అంటున్నాయి.
కమల్ హాసన్ గొప్ప నటుడని, ఆయన ఎప్పుడూ సినిమాల మీదే దృష్టి పెడుతారని, రాజకీయాల మీద అంత ఆసక్తి లేదని తమిళ సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు అంటున్నారు. అయితే ఈ విషయంపై రాజ్ ఠాక్రే, కమల్ హాసన్ మాత్రం స్పందించలేదు.