మహారాష్ట్ర ఎన్నికల్లో రాజ్థాక్రే: 100 స్థానాల్లో ఎంఎన్ఎస్ పోటీ!
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ-శివసేన, అటు ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలు పోటీ చేస్తుండగా.. ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమైంది రాజ్థాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన. అక్టోబర్ 21న జరిగే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు రాజ్ థాక్రే తెలిపారు.
బాంద్రాలో సోమవారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంోల పోటీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. సుదీర్ఘ కాలంగా తాను మౌనంగా ఎందుకు ఉండాల్సి వచ్చిందో కూడా తాను త్వరలోనే వెల్లడిస్తానని రాజ్ థాక్రే చెప్పుకొచ్చారు.
అంతేగాక, రాబోయే రెండ్రోజుల్లోనే తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. సుమారు 100 అసెంబ్లీ స్థానాల్లో ఎంఎన్ఎస్ పోటీ చేస్తుందని పార్టీ నేతల ద్వారా తెలిసింది.
అక్టోబర్ 5న భారీ బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందని, అదే రోజు రాజ్ థాక్రే అన్ని వివరాలు వెల్లడిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. కాగా, శివసేన అధినేత ఉద్దవ్ థాక్రేకు వరుసకు సోదరుడైన రాజ్ థాక్రే 2006లో శివసేనను వీడి మహారాష్ట్ర నవనిర్మాణ సేన అనే పార్టీని ప్రకటించారు.
కాగా, బీజేపీ-శివసేన కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, బీజేపీ-శివసేన పోటీ చేసే స్థానాలపై క్లారిటీ రాకపోవడంతో ఇన్నాళ్లు ఆగిపోయారు. కానీ బీజేపీ 144, శివసేన 126 పోటీ చేస్తారని విశ్వసీనయంగా తెలిసింది. మిగిలిన 18 స్థానాలకు తమ భాగస్వామ్యపక్షాలకు కేటాయిస్తారు.
బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే ప్రస్తుత సీఎం ఫడ్నవీస్ తిరిగి పగ్గాలు చేపడుతారు. డిప్యూటీ సీఎం పదవీ మాత్రం శివసేనకు అప్పగిస్తామని వీరి మధ్య ఒప్పందం జరిగింది. కానీ ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే కూడా సీఎం రేసులో ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై శివసేన పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది. కానీ బీజేపీతో ఉద్ధవ్ థాక్రే ఏం చెప్పారనే అంశంపై క్లారిటీ లేదు