ట్రిపుల్ తలాక్ కు రాజముద్ర.. రాష్ట్రపతి ఆమోదం..! చట్టరూపం దాల్చనున్న బిల్లు..!!
ఢిల్లీ/హైదరాబాద్ : ట్రిపుల్ తలాక్ బిల్లు పై లొల్లి ముగిసింది. ఎట్టకేలకు చట్టసభలను దాటుకుని బిల్లు రాజముద్ర వేసుకుంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఇప్పుడు ఆ బిల్లు చట్టరూపం దాల్చనున్నది. ముస్లిం మహిళలకు మూడుసార్లు తలాక్ చెప్పి విడాకులు తీసుకునే పద్దతికి ఈ చట్టం ద్వారా స్వస్తి పలికినట్లు అయింది. ఇక ఈ చట్టం ప్రకారం ముస్లిం మహిళలకు మూడుసార్లు తలాక్ చెబితే, భర్తలకు మూడేళ్ల జైలు శిక్షను విధించనున్నారు. కాగా మంగళవారమే వివాదాస్పద ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించిన విషయం తెలిసిందే.
ట్రిపుల్ తలాక్ కు రాష్ట్రపతి ఆమోదం..! చట్ట రూపం దాల్చనున్న బిల్లు..!!
ఏకకాలంలో మూడుసార్లు తలాక్ చెప్పడం ద్వారా విడాకులిచ్చే పద్ధతిని క్రిమినల్ నేరంగా పరిగణించే ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు-2019కు రాజ్యసభ అంగీకారం తెలిపింది. బీజేడీ మద్దతుగా నిలువడం, మిత్రపక్షాలు జేడీయూ, అన్నాడీఎంకే వాకౌట్ చేయడం, పలువురు విపక్ష సభ్యుల గైర్హాజరు నేపథ్యంలో ప్రతిపక్షాల ఆధిక్యత ఉన్న పెద్దల సభలో అధికార బీజేపీ సునాయాసంగా గట్టెక్కింది.
ఇక మీదట మూడుసార్లు తలాక్ చెప్తే తంటాలే..! మూడేళ్ల జైలు తప్పదు..!!
గతవారమే ఈ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలుపగా, తాజాగా రాజ్యసభ కూడా అంగీకారం తెలిపింది. రాజ్యసభలో బిల్లు పాసైన తర్వాత రాష్ట్రపతి తన ట్విట్టర్లో స్పందించారు. పార్లమెంట్లో బిల్లుకు ఆమోదం దక్కినట్లు పేర్కొన్నారు. లింగ సమానత్వం కోసం జరుగుతున్న పోరాటంలో ఇదో మైలురాయి అన్నారు. యావత్ దేశం సంతోషపడే క్షణం ఇదని రామ్ నాథ్ ట్వీట్ చేశారు. బీజేపీ ప్రభుత్వం అనుకున్నది సాధించింది. ఏడాదిన్నర కాలంగా ఆర్డినెన్స్ తో నెట్టుకువస్తున్న ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఎట్టకేలకు ఎగువ సభలో ఆమోద ముద్ర పడింది.
కఠిన నిర్ణయాలు..! స్వేఛ్చా వాయువులు పీల్చుకోనున్న ముస్లిం మహిళలు..!!
తలాక్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదమే మిగిలి ఉంది. ఈ బిల్లును పాస్ చేయించాలని కొద్ది నెలలుగా బీజేపీ పెద్దలు పట్టుదలతో ఉన్నారు. కొద్దిరోజుల క్రితం లోక్ సభలో పాసైన ట్రిపుల్ తలాక్ బిల్లును ఈ రోజు రాజ్యసభలో ప్రవేశపెట్టింది కేంద్రం. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ముస్లిం మహిళల శ్రేయస్సు కోసమే ఈ బిల్లు తెచ్చామని ఆయన వివరించారు. ప్రపంచంలో అనేక ముస్లిం దేశాలు ఈ విధానాన్ని రద్దు చేశాయని గుర్తు చేశారు. ఈ బిల్లును విపక్షాలు వ్యతిరేకించడం సబబుకాదని హితవు పలికారు. అనంతరం బిల్లుపై సభలో వివిధ పార్టీలకు చెందిన నేతలు మాట్లాడారు.
నాలుగేళ్టుగా నలిగిన బిల్లు..! ఎట్టకేలకు కార్యరూపం దాల్చిన కొత్త చట్లం..!!
బిల్లును కాంగ్రెస్, టీఎంసీ, ఆర్జేడీ, ఎస్పీ, ఆప్, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బిల్లు ఆమోదానికి ముందు బిల్లులో విపక్షాలు పలు సవరణలు ప్రతిపాదించాయి. అయితే అవన్నీ మూజువాణి ఓటింగ్ ద్వారా వీగిపోయాయి. చివరకు బిల్లుకు అనుకూలంగా 99 మంది ఓట్లు, వ్యతిరేకంగా 84 ఓట్లు వచ్చాయి. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలు వాకౌట్ చేశాయి. ముస్లిం మహిళల శ్రేయస్సు కోసం ఈ బిల్లు రూపొందించామని, ఆమోదం లభించడం పట్ల బీజేపీ హర్షం వ్యక్తం చేసింది.