తీహార్ జైల్లో మాఫియా డాన్ ఛోటా రాజన్
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ మాఫియా డాన్ ఛోటా రాజన్ ను కట్టుదిట్టమైన భద్రతతో గురువారం రాత్రి తీహార్ జైలుకు తరలించారు. సీబీఐ విచారణ అనంతరం ఛోటా రాజన్ ను ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు. ఛోటా రాజన్ ను విచారించడానికి అనుమతి ఇవ్వాలని సీబీఐ అధికారులు కోర్టులో మనవి చేశారు.
అయితే న్యాయస్థానం ఛోటా రాజన్ ను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. తిరిగి డిసెంబర్ 3వ తేదిన కోర్టు ముందు రాజన్ ను హాజరు పరచాలని ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ ఓ.పీ. సైనీ ఆదేశాలు జారీ చేశారు.
హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు, బలవంతపు వసూళ్లు, నకిలి పాస్ పోర్టు తోపాటు అనేక కేసులు ఉన్నాయి. దాదాపు 27 ఏళ్ల పాటు ఛోటా రాజన్ తప్పించుకుని విదేశాలలో తిరుగుతున్నాడు. ఇతని మీద ముంబై, ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలలో 85 కేసులు నమోదు అయ్యాయి.
అందులో 71 కేసులు విచారించడానికి సీబీఐ అంగీకరించింది. వాటిలో ఇప్పటికే కొన్ని కేసుల విచారణ మొదలు పెట్టింది. ఇంటర్ పోల్ సహాయంతో ఇండోనేషియాలోని బాలిలో ఛోటా రాజన్ ను అరెస్టు చేసి భారత్ తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.
హై సెక్యూరిటి.............!
తీహార్ జైల్లో కరుడుకట్టిన తీవ్రవాదులు, ఉగ్రవాదులు, నేరస్తులు ఉన్నారు. అదే తీహార్ జైల్ నెంబర్ 2 లో ఛోటా రాజన్ కు కట్టుదిట్టమైన భద్రత ఉన్న సెల్ కేటాయించారు. సాయుధ పోలీసులు 24 గంటల పాటు సెల్ దగ్గర భద్రతా ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు.