రసవత్తరంగా రాజస్థాన్ రాజకీయం..! మనేంద్ర సింగ్ రాజీనామాతో బీజేపికి షాక్..!!
హైదరాబాద్ : ఉత్కంఠ పోరుకు వేదికగా మారిన రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఎదుర్కొనేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. దానిలో భాగంగా కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రచారం జరుగుతున్న పీసీసీ చీఫ్ సచిన్ పైలెట్పై ముస్లిం నేత, మంత్రి యూనిస్ ఖాన్ను బరిలో దింపింది. రాజస్తాన్లో అత్యధికంగా ముస్లిం ప్రాబల్య ప్రాంతమైన టోంక్ స్థానంలో వీరిద్దరు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి బలమైన క్యాడర్ ఉన్న ఈ స్థానంలో 1972 నుంచి ముస్లిం అభ్యర్థినే బరిలో నిలుపుతూ వచ్చింది. బీజేపీ కూడా గత నాలుగు దశాబ్దాల నుంచి ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న అభ్యర్థినే పోటీలో నిలిపేంది. కాగా నలభై ఆరేళ్ల తరువాత కాంగ్రెస్ తొలిసారి ముస్లిమేతరులకు టికెట్ కేటాచించడం కొసమెరుపు.
టోంక్ స్థానం నుంచి బరిలో సచిన్ పైలెట్, మంత్రి యూనిస్ ఖాన్..! గెలుపు పై ఉత్కంఠ..!!
రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిన నేపథ్యంలో అటు కాంగ్రెస్ ఇటు బీజేపి రెండు పార్టీలు అభ్యర్థులను మార్చాయి. దీంతో ఈ నియోజకవర్గంపై రాజకీయం రసవత్తరంగా మారింది. నలభైఏళ్ల సాంప్రదాయానికి చెక్పెట్టిన కాంగ్రెస్ సచిన్ను బరిలోకి దింపడంతో.. చివరి నిమిషంలో తేరుకున్న బీజేపీ మైనార్టీల ఓట్లను దండకుంనేందుకు ముస్లిం అభ్యర్థిని బరిలో నిలిపింది. యూనిస్ ఖాన్, వసుంధర ప్రభుత్వంలో రవాణశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. సోమవారం నామిషన్లకు చివరి రోజు కావడంతో బీజేపీ విడుదల చేసిన ఐదో జాబితాలో ఆయన పేరును ఖరారు చేసింది. గత ఎన్నికల్లో బీజేపీ తరుఫున కేవలం ఇద్దరు అభ్యర్థులు మాత్రమే గెలిచిన విషయం తెలిసిందే.
జశ్వంత్ సింగ్ కుమారుడు, ఎమ్మెల్యే మన్వేంద్ర సింగ్ రాజీనామా..! షాక్ లో బీజేపి..!
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాజస్తాన్లో అధికార బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. మాజీ కేంద్రమంత్రి జశ్వంత్సింగ్ కుమారుడు, ప్రస్తుత ఎమ్మెల్యే మన్వేంద్ర సింగ్ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బర్మేర్ జిల్లాల్లో శనివారం తన అభిమానులతో ‘స్వాభిమాన్ ర్యాలీ'ని నిర్వహించిన మన్వేంద్ర.. బీజేపీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. గత లోక్సభ ఎన్నికల్లో తన తండ్రికి బీజేపీ ఎంపీ సీటు ఇవ్వకుండా తీవ్రంగా అవమానించిందని, ఇన్ని రోజులు ఒపిక పట్టామని ఇక సహించేదిలేదని ఆయన పేర్కొన్నారు.
ఓ పక్క ఎన్నికల వేడి..! మరోపక్క రాజీనామాలు..! ఆసక్తిగా రాజస్థాన్ రాజకీయం..!!
గతకొంత కాలంగా బీజేపీ నాయకత్వంతో అంటీముట్టనట్లు ఉంటున్న మన్వేంద్ర తన రాజీనామాతో పార్టీకి షాకిచ్చాడు. సీఎం వసుంధర రాజే ఇటీవల బర్మేర్ పర్యటనకు వచ్చిన సమయంలో కూడా ఆయన పార్టీకి దూరంగానే ఉన్నారు. వసుంధర రాజే రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన గౌరవ్యాత్రపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఆమె పర్యటిస్తూ కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. కాగా బీజేపీకి రాజీనామా చేసిన మన్వేంద్ర తరువాత ఏ పార్టీలో చేరబోయేది మాత్రం ఇంకా వెల్లడించలేదు.
నష్టనివారణ చర్యల దిశగా బీజేపి..! డ్యామేజ్ కంట్రోల్ చేస్తామంటున్న నాయకులు..!
తన ప్రాంత ప్రజల అభివృద్ధికోసం వారితో చర్చించిన అనంతరం తదుపరి నిర్ణయం ప్రకటిస్తానని ఆయన తెలిపారు. కాగా మాజీ కేంద్ర మంత్రి ఐన జశ్వంత్ సింగ్కు 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ టిక్కెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి చేతిలో పరాజయం పాలైన విషయం తెలిసిందే. కాగా మన్వేంద్ర రాజీనామాతో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కమళదళానికి ఊహించని షాక్ తగిలింది. దీంతో నష్ట నివారణ చర్యలకు పూనుకుంది బీజేపి.