దళిత యువకులపై పైశాచికం: స్తంభానికి కట్టి..చితక్కొట్టి..మలద్వారంలో పెట్రోల్ పోసిన వైనం.. !
జైపూర్: రాజస్థాన్లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. చోరీకి ప్రయత్నించారనే కారణంతో ఇద్దరు దళిత యువకులపై అత్యంత అమానవీయంగా ప్రవర్తించారు దుకాణ యజమాని, సిబ్బంది. వారిద్దర్నీ స్తంభానికి కట్టి చితక్కొట్టారు. వారి దెబ్బలకు తట్టుకోలేక సొమ్మసిల్లిన ఓ యువకుడిని నగ్నంగా మార్చారు. స్క్రూడ్రైవర్ ద్వారా మలద్వారంలో పెట్రోల్ను పోసి.. పైశాచిక ఆనందాన్ని పొందారు. ఈ ఘటనలో ఆ ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
రాజకీయ రంగు పులుముకుంటోన్న ఘటన..
దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఈ ఘటన రాజకీయ రంగును పులుముకొంది. దళితులపై దాడులు కొనసాగుతున్నప్పటికీ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవట్లేదంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. దళిత సంఘాల నాయకులు ఆందోళనలను వ్యక్తం చేస్తున్నారు. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్.. ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ స్వరా భాస్కర్ వంటి కొందరు ప్రముఖులు ట్విట్వర్ వేదికగా స్పందిస్తున్నారు.
బైక్ సర్వీసింగ్ సెంటర్లో ఘటన..
రాజస్థాన్లోని నాగౌర్ జిల్లా పాంచౌడీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కరణు గ్రామంలో ఈ నెల 16వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో బుధవారం సాయంత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో వెలుగులోకి వచ్చిన వెంటనే పోలీసులు స్పందించారు. దళిత యువకులపై దాడి చేసిన అయిదుమందిని గురువారం ఉదయం అరెస్టు చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
క్యాష్ కౌంటర్ వద్ద చోరీకి పాల్పడ్డారనే ఆరోపణలతో..
బాధిత యువకుడు తన స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనాల సర్విసింగ్ సెంటర్కు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని పాంచౌడీ ఎస్ఐ రాజ్పాల్ సింగ్ తెలిపారు. సర్విసింగ్ కోసం ఇచ్చిన తన బైక్ను తీసుకోవడానికి వెళ్లిన ఆ ఇద్దరు యువకులు క్యాష్ కౌంటర్ సమీపంలో కూర్చుని ఉండగా.. యజమాని, అక్కడి సిబ్బంది చోరీ చేస్తున్నారనే ఆరోపణలపై దాడికి పాల్పడ్డారని వివరించారు.
అయిదుమంది అరెస్టు..
ఈ సందర్భంగా దళిత యువకులతో వారు వాగ్వివాదానికి దిగారని, రెండు గ్రూపుల మధ్య చెలరేగిన వాగ్వివాదం ఘర్షణకు దారి తీసిందని చెప్పారు. వారిపై దాడి చేసిన భీవ్ సింగ్, లక్ష్మణ్ సింగ్, అయిదాన్, సవాయ్ సింగ్, హడ్మన్ సింగ్, గణ్పత్ రామ్లను అరెస్టు చేశామని, వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై బీజేపీ ఎంపీ హనుమాన్ బేణీవాల్, స్వరాభాస్కర్ సహా పలువురు ప్రముఖులు స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.