ఘోర రోడ్డు ప్రమాదం... జీపు-ట్రక్కు ఢీ... 8 మంది అక్కడికక్కడే మృతి...
రాజస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జీపు-ట్రక్కు ఢీకొన్న ఘటనలో 8 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా ఖాటూశ్యామ్ జీ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులను మధ్యప్రదేశ్ వాసులుగా గుర్తించారు. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Recommended Video
ఇటీవలి కాలంలో రాజస్తాన్లో వరుస రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గతేడాది డిసెంబర్లో రాజస్తాన్లోని చిత్తోర్గఢ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. లారీ, క్రూజర్ వాహనాలు రెండూ ఎదురెదురుగా ఢికొనడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించింది.రాజస్థాన్కు చెందిన ఓ కుటుంబం.. మధ్యప్రదేశ్లో ఓ శుభ కార్యక్రమానికి హాజరై క్రూజర్లో తిరిగి వస్తుండగా మార్గమధ్యలో చిత్తౌడ్గఢ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం విచారం వ్యక్తంచేశారు.