జైపూర్ నరమేథం: నలుగురికి ఉరి శిక్ష: 80 మందిని పొట్టన పెట్టుకున్న ఉదంతం..!
జైపూర్: పింక్ సిటీ జైపూర్ ను వణికించిన వరుస బాంబు పేలుళ్ల కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష పడింది. ఈ మేరకు ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెలువడించింది. రాజస్థాన్ రాజధాని జైపూర్ లో రద్దీ ప్రాంతాల్లో బాంబులను అమర్చి, వాటిని పేల్చివేసిన ఘటనలో నలుగురిని ప్రత్యేక న్యాయస్థానం ఇదివరకే దోషులుగా గుర్తించిన విషయం తెలిసిందే. వారికి శిక్షను ఖరారు చేసింది. ఉరి శిక్షను విధించింది.
మండుతున్న ఉత్తర్ ప్రదేశ్: డజనుకు పైగా జిల్లాల్లో హింస: వాహనాలకు నిప్పు..పోలీసులపైకి రాళ్లు..!
నలుగురు దోషుల్లో..
ఈ కేసులో దోషులుగా తేలిన మహ్మద్ సైఫ్, మహ్మద్ సర్వర్ అజ్మీ, మహ్మద్ సల్మాన్, సైఫుర్ రెహ్మాన్ ప్రస్తుతం జైపూర్ లోని కేంద్ర కారాగారంలో ఉంటున్నారు. ఇదే కేసులో షెహబాజ్ హుస్సేన్ ను ప్రత్యేక న్యాయస్థానం నిర్దోషిగా గుర్తించింది. అతనిపై నమోదైన కేసును కొట్టి వేసింది. మిగిలిన ఇద్దరికీ ఉరిశిక్షను విధిస్తూ రాజస్థాన్ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి తన తీర్పును వెలువడించారు. ఆ సమయంలో నలుగురు దోషులూ న్యాయస్థానంలోనే ఉన్నారు.
80 మందిని పొట్టన పెట్టుకున్న ఘటన..
2008 మే 13వ తేదీన జైపూర్ చోటు చేసుకున్న వరుస బాంబు పేలుళ్ల కేసులో 80 మంది మరణించారు. సుమారు 225 మందికి పైగా గాయపడ్డారు. జైపూర్ లోని ప్రఖ్యాత పర్యాటక ప్రదేశం హవా మహల్ సహా పలు చోట్ల వరుసగా బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. హవా మహల్ కు చుట్టూ రెండు కిలోమీటర్ల పరిధిలో ఈ వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. సైకిళ్లకు బాంబులు అమర్చి, నరమేథాన్ని సృష్టించారు ఉగ్రవాదులు.
బాట్లా హౌస్ ఎన్ కౌంటర్ లో..
ఇండియన్ ముజాహిద్దీన్, హర్కతుల్ జిహాద్-ఇ-ఇస్లామీ ఉగ్రవాద సంస్థలు ఈ దారుణానికి బాధ్యులుగా గుర్తించారు. ఈ కేసులో మొత్తం అయిదుమందిని అరెస్టు చేశారు పోలీసులు. వారిలో షెహబాజ్ హుస్సేన్ నిర్దోషిగా తేలడంతో అతనిపై కేసును కొట్టివేసింది న్యాయస్థానం. మిగిలిన నలుగురికీ ఉరిశిక్షను విధించింది. ఈ బాంబు పేలుళ్లకు ప్రధాన సూత్రధారిగా గుర్తించిన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది జునైద్ ప్రస్తుతం జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. గత ఏడాది ఫిబ్రవరిలో అతన్ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. మరొక ఉగ్రవాది బాట్లా హౌస్ ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు.