ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన యువనేత.. కాపాడుకొనేందుకు సీఎం తంటాలు: బీజేపీ
రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలపై బీజేపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, యువనేత సచిన్ పైలెట్ మధ్య అంతర్గత కుమ్ములాటలు రాష్ట్రాన్ని సమస్యల్లోకి నెట్టిందని బీజేపీ విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విబేధాలు రాష్ట్రాన్ని ఎడారిగా మారుస్తున్నది అని రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ సతీష్ పూనియా విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సచిన్ పైలెట్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం పదవి కోసం పాకులాట
రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి సచిన్ పైలెట్ బాగా తొందరపడుతున్నారు. అదే సమయంలో సీఎం గెహ్లాట్ కుర్చీని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కాంగ్రెస్లోని కుమ్ములాటల వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు అని అధ్యక్షుడు డాక్టర్ సతీష్ పూనియా మండిపడ్డారు.
సచిన్ పైలెట్ తీరు వల్లే
రాష్ట్రంలోని అస్తవ్యస్త పరిస్థితుల గురించి అంధులను అడిగినా స్పష్టంగా చెబుతారు. సచిన్ పైలెట్ పదవీ కాంక్ష రాష్ట్రాన్ని సమస్యల్లోకి నెట్టింది. దాంతో ముఖ్యమంత్రి గెహ్లాట్ పాలనపై పట్టు కోల్పోయారు. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజలు మరింత ఇబ్బందులకు గురికాక తప్పదు అని సతీష్ పూనియా పేర్కొన్నారు.
100కు పైగా మరణాలు
రాష్ట్రంలో వైద్య సదుపాయాలు మరింత అధ్వాన్నంగా మారాయి. జేకే లోన్ హాస్పిటల్లో 100 మందికి పైగా శిశు మరణాలు సంభవించడం దారుణం. చాలా సున్నితమైన అంశాన్ని సరైన రీతిలో డీల్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ దారుణంగా విఫలమైంది అని పూనియా ఆరోపించారు.
శిశు మరణాలతో దారుణం
రాష్ట్రంలో కోల్కతాలోని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏకంగా సీఎం సొంత జిల్లా జోధ్పూర్లోని పరిస్థితులు దిగజారాయి. బుండి, బికనూర్ లాంటి ప్రాంతాల్లో శిశు మరణాలు సంభవిస్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నాయో ఊహించుకోవచ్చు అని పూనియా ఆందోళన వ్యక్తం చేశారు.
సీఎంకు పట్టింపు లేదా?
ఇక ముఖ్యమంత్రి గెహ్లాట్ తీరును అధ్యక్షుడు డాక్టర్ సతీష్ పూనియా తప్పు పట్టారు. 100కుపైగా మరణాలు సంభవిస్తే ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. కనీసం బాధితుల కుటుంబాలను కూడా పరామర్శించకపోవడం ఆయన వైఖరికి అద్దం పడుతున్నది. కోటను సందర్భించి శిశు మరణాలను అడ్డుకొనేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.