రాజస్థాన్ ఎన్నికలు: కాంగ్రెస్ లో చేరిన బీజేపీ ఎంపీ, మాజీ డీజీపీ మీనా దెబ్బకు హడల్!
జైపూర్: రాజస్థాన్ లో శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో భారతీయ జనాతా పార్టీ (బీజేపీ)కి ఆ పార్టీ ఎంపీ గట్టి షాక్ ఇచ్చారు. ఎవ్వరూ ఊహించని విధంగా బీజేపీ ఎంపీ హరీష్ చంద్రా మీనా (64) బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ నాయకులకు ఝలక్ ఇచ్చారు.
రాజస్థాన్ లోని దౌస లోక్ సభ నియోజక వర్గం ఎంపీగా ఉన్న హరీష్ చంద్రా మీనా బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అశోక్ గోహ్లెట్, సచిన్ పైలెట్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ ఎంపీ హరీష్ చంద్రా మీనాకు అధికారికంగా అశోక్ గెహ్లెట్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
రాజస్థాన్ లో డిసెంబర్ 7వ తేదీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో బీజేపీ ఎంపీ హరీష్ చంద్రా మీనా కాంగ్రెస్ లో చేరడంతో బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. హరీష్ చంద్రా మీనాకు ఎక్కువ మద్దతుదారులు ఉన్నారు.
1976 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన హరీష్ చంద్ర మీనా 2009 నుంచి 2013 డిసెంబర్ వరకూ రాజస్థాన్ రాష్ట్ర డీజీపీగా పని చేశారు. సమర్థవంతమై పోలీసు అధికారిగా హరీష్ చంద్రా మీనాకు పేరు ఉంది. డీజీపీగా పదవి విరమణ చేసిన హరీష్ చంద్రా మీనా 2014లో బీజేపీలో చేరారు. బీజేపీ నాయకులు హరీష్ చంద్రా మీనాకు దౌస లోక్ సభ నియోజక వర్టం టిక్కెట్ ఇచ్చారు.
దౌస లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన హరీష్ చంద్రా మీనా భారీ మెజారిటీతో ఎంపీ అయ్యారు. రాజస్థాన్ లో మీనా వర్గం ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. హరీష్ చంద్రా మీనా చేరికతో మీనా వర్గీయులు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపే అవకాశం ఉందని తెలిసింది. హరీష్ చంద్రా మీనా సోదరుడు నారాయణ మీనా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మొత్తం మీద బీజేపీ నాయకులకు ఎంపీ హరీష్ చంద్రా మీనా ఊహించని షాక్ ఇచ్చారు.