బురదలో కూర్చొని శంఖం ఊదితే కరోనాను జయించవచ్చు : బీజేపీ ఎంపీ
గోమూత్రం,పేడలతో కరోనా నయం అవుతుందని ఒకరు... అప్పడాలు తింటే కరోనా పోతుందని మరొకరు... ఇలా ఇటవలి కాలంలో బీజేపీ నేతలు ఇచ్చిన స్టేట్మెంట్స్ అభాసుపాలయ్యాయి. తాజాగా మరో బీజేపీ నేత కరోనా వ్యాధిని నయం చేసేందుకు ఓ చిత్రమైన చిట్కా చెప్పారు.
బురదలో కూర్చొని శంఖం ఊదితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని,తద్వారా కరోనా వ్యాధిని నయం చేయవచ్చునని రాజస్తాన్ బీజేపీ ఎంపీ సుఖ్బీర్ సింగ్ జౌనపురియా పేర్కొన్నారు. ఎంపీ ఇచ్చిన ఈ సలహాపై చాలామంది నోరెళ్లబెడుతున్నారు. సుఖ్బీర్ సింగ్ గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఒంటికి బురద పూసుకుని యోగా చేస్తే అన్ని వ్యాధులు నయమవుతాయని కొద్ది నెలల క్రితమే స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదేమైనా ఎంపీ గారి 'బురదలో కూర్చుని శంఖం ఊదడం' సలహా ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
సుఖ్బీర్ కంటే ముందు కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ కూడా కరోనా చికిత్సకు సంబంధించి విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. 'బాబీజీ పాపడ్' తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని... తద్వారా కరోనా నయం అవుతుందని పేర్కొన్నారు. అంతకుముందు, అసోం బీజేపీ ఎమ్మెల్యే సుమన్ హరిప్రియ... గోమూత్రం,పేడలతో కరోనాను నయం చేయవచ్చునని వ్యాఖ్యానించి అందరినీ ఆశ్చర్యపరిచారు.'ఆవు పేడ చాలా రకాలుగా ఉపయోగపడుతుందని మనందరికీ తెలుసు. ఆవు మూత్రాన్ని ఎక్కడైతే చల్లుతామో.. ఆ ప్రాంతం శుద్ది అవుతుంది. కాబట్టి గోమూత్రం,గోవు పేడలతో కరోనా వ్యాధిని కూడా నయం చేయవచ్చునని నేను భావిస్తున్నాను.' అని పేర్కొన్నారు.
Recommended Video
ఓవైపు కరోనా వ్యాక్సిన్ కోసం అనేక దేశాల సైంటిస్టులు ప్రయోగాల్లో తలమునకలై ఉండగా... బీజేపీ నేతలు ఇలా చిత్ర,విచిత్రమైన సలహాలు,సూచనలు ఇస్తుండటంపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.