మళ్లీ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు జరగొచ్చు... రాజస్తాన్ సీఎం గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు మరో ప్రయత్నం జరిగే అవకాశం ఉందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శనివారం ఆరోపించారు. అంతేకాదు,మహారాష్ట్రలోనూ మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని గద్దె దించే ప్రయత్నం జరుగుతోందన్నారు. 'ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలను కూల్చేందుకు వాళ్లు కుట్రలు పన్నుతుంటారు. రాజస్తాన్లో మళ్లీ ఆ గేమ్ మొదలుపెడుతున్నారు.' అని గెహ్లాట్ బీజేపీపై ఆరోపణలు చేశారు. సిరోహి జిల్లాలోని శివగంజ్ నగర్లో పార్టీ కొత్త కార్యాలయ ప్రారంభోవత్సం సందర్భంగా ఆయన మాట్లాడారు.
'ఇంతకుముందు కూడా నోట్ల కట్టలతో ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించింది. ఎమ్మెల్యేలు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఎలా కలిశారో అందరూ చూశారు. రణదీప్ సూర్జేవాలా,అజయ్ మాకెన్,కేసీ వేణు గోపాల్,అవినాష్ పాండే లాంటి మన పార్టీ సీనియర్లంతా రెబల్ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించాలని నిర్ణయించారు. దాంతో ప్రభుత్వం మళ్లీ నిలదొక్కుకోగలిగింది.' అని ఈ ఏడాది జులైలో రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొన్న సంక్షోభాన్ని అశోక్ గెహ్లాట్ గుర్తుచేశారు.
మరోవైపు గెహ్లాట్ వ్యాఖ్యలపై సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయం వ్యక్తమవుతుండటం గమనార్హం. కేబినెట్ విస్తరణకు పార్టీ అధిష్టానం ఆదేశించిందని... ఆ పక్రియను ఆలస్యం చేసేందుకే అశోక్ గెహ్లాట్ ఈ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని పేరు బయటపెట్టేందుకు ఇష్టపడని ఓ ఎమ్మెల్యే పేర్కొన్నారు.అశోక్ గెహ్లాట్ ఆరోపణలు నిరాధారమని బీజేపీ నేత గులాబ్ చంద్ కటారియా కొట్టిపారేశారు.
కాగా,ఈ ఏడాది జులైలో కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ నేత్రుత్వంలో ఆ పార్టీకి చెందిన 18 ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 34 రోజుల పాటు కొనసాగిన ఈ ప్రతిష్టంభన... ఎట్టకేలకు సచిన్ పైలట్ దిగి రావడంతో సుఖాంతమైంది. ఇదే తరహాలో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ యువ నేత జ్యోతిరాదిత్య సింధియా పార్టీపై తిరుగుబాటు చేసి ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బీజేపీ తరుపున ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు.