102 ఎమ్మెల్యేల మద్దతు: గవర్నర్ ను కలిసిన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్
జైపూర్: రాజస్థాన్ రాజకీయాల్లో సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శనివారం సాయంత్రం తనకు 102 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ రాజ్భవన్ వెళ్లి గవర్నర్ కల్ రాజ్ మిశ్రాను కలిశారు.
గవర్నర్ కల్ రాజ్ మిశ్రాను మర్యాదపూర్వకంగానే కలిసినట్లు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తెలిపారు. తటస్థంగా ఉంటామన్న ఇద్దరు భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) ఎమ్మెల్యేలు కూడా తాము కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తామంటూ ప్రకటించిన కొద్ది గంటల్లోనే సీఎం గెహ్లాట్ గవర్నర్ను కలవడం గమనార్హం.
సచిన్ పైలట్, ఆయన మద్దతుదారులు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మారిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇతర ఎమ్మెల్యేలను జైపూర్లోని ఫేర్మోంట్ హోటల్కు తరలించారు.
సచిన్ పైలట్, ఆయనకు మద్దతుగా నిలిచిన 18 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ను కోరిన విషయం తెలిసిందే. దీంతో వారికి స్పీకర్ నోటీసులు జారీ చేశారు. అయితే, హైకోర్టు వారిపై చర్యలు వచ్చేవారం వరకు కూడా చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.
ఇది ఇలావుండగా, గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న రాజస్థాన్ రాజకీయ హైడ్రామాపై ఎట్టకేలకు ఆ రాష్ట మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత వసుంధర రాజే స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అసమ్మతికి రాస్ట్ర ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారని మండిపడ్డారు. ఆ పార్టీ వివాదాల్లో తనను, తమ పార్టీని లాగొద్దని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.
కరోనావైరస్ కారణంగా రాష్ట్రంలో 500 మంది ప్రాణాలు కోల్పోయారని, దాదాపు 28వేల మంది కరోనా బాధితులున్నారని వసుంధర రాజే తెలిపారు. ఇక రాష్ట్రంలో మిడతల సమస్య కూడా ఉందన్నారు. అంతేగాక, రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని అన్నారు.
రాష్ట్ర ప్రజలు విద్యుత్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వసుంధర రాజే తెలిపారు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలతో ప్రజలు సమస్యలతో సతమవుతుంటే.. ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న సంక్షోభం వారిని మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు.