రాజేకు కొత్త చిక్కు: పద్మశ్రీకి మోడీ పేరు సిఫార్సు
న్యూఢిల్లీ: రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేకి ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ కారణంగా మరో తల నోప్పి వచ్చి పడింది. క్రీడారంగానికి లలిత్ మోదీ అందిస్తున్న సేవలు గుర్తించి ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించాలని వసుంధర రాజే సిఫార్సు చేసిన విషయం వెలుగు చూసింది.
వసుంధర రాజే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2007 జులై 28వ తేదిన లలిత్ మోదీకి పద్మశ్రీ ఇచ్చి సత్కరించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసి ఒక లేఖ వ్రాశారు. ఆ లేఖను క్రీడారంగంలోని అధికారులతోనే కేంద్ర ప్రభుత్వానికి పంపించారని వెలుగు చూసింది.
ఈ విషయం రాజస్థాన్ లోని స్థానిక మీడియా బయట పెట్టింది. లలిత్ మోదీ వ్యాపార రంగాన్ని అభివృద్ది చేస్తున్నారని, అంతే కాకుండ రాష్ట్రంలో క్రికెట్ బోర్డును ప్రగతిపథంలో ముందుకు తీసుకు వెళుతున్నారని చెబుతూ అందుకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని సిఫార్సు చేశారు.
తరువాత లలిత్ మోదీ ఐపీఎల్ కుంబకోణంలో కూరుకుపోయి 2010లో దేశం విడిచి వెళ్లి లండన్ లో తలదాచుకున్నాడు. తన కుమారుడి వ్యాపారంలో లలిత్ మోదీ పెట్టుబడులు పెట్టాడని ఆరోపణలు ఎదుర్కోంటున్న వసుంధర రాజేకి ఇప్పుడు లలిత్ మోదీ వలన ఇంకో కొత్త చిక్కు వచ్చిపడింది.