రాజస్తాన్లోనూ రాజకీయ సంక్షోభం తప్పదా.. రిసార్టులకు ఎమ్మెల్యేలు.. వేగంగా మారుతున్న సీన్..
రాజ్యసభ ఎన్నికల వేళ కాంగ్రెస్కు కష్టాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే గుజరాత్లో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా.. మిగతా ఎమ్మెల్యేలు జారిపోకుండా జాగ్రత్తపడుతోంది. ఈ వ్యవహారం ఇలా కొనసాగుతుండగానే తాజాగా రాజస్తాన్లోనూ ఇదే తరహా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ ప్రభుత్వ చీఫ్ విప్ మహేష్ జోషి ఆరోపించారు. బేర సారాలతో తమ పార్టీ ఎమ్మెల్యేలను,ప్రభుత్వానికి మద్దతునిస్తున్న స్వతంత్రులను కొనేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దీనిపై డీజీకి లేఖ కూడా రాసిన ఆయన.. బీజేపీ కుయుక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు..
ఈ నెల 19న 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో రాజస్తాన్ నుంచి 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఒక రాజ్యసభ స్థానం గెలుచుకోవాలంటే 51 మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరం అవుతాయి. ప్రస్తుతం కాంగ్రెస్కు 107 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇందులో ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు,12 మంది స్వతంత్రులు కూడా ఉన్నారు. బీజేపీకి 72 మంది సభ్యుల బలం ఉంది. ప్రస్తుత సంఖ్యా బలాన్ని బట్టి అక్కడ కాంగ్రెస్కు రెండు,బీజేపీకి ఒక రాజ్యసభ స్థానం దక్కే అవకాశం ఉంది. కానీ బీజేపీ ఇద్దరు అభ్యర్థులను బరిలో దింపి రాజకీయంగా కాక పుట్టించింది. ఇద్దరు అభ్యర్థులను గెలిపించుకునేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బయటకు లాగే ప్రయత్నం చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్యేలను లాగుతోందని బీజేపీపై ఆరోపణలు
ఆ 12 మంది స్వతంత్రులతో పాటు కాంగ్రెస్ నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవడం ద్వారా రెండు రాజ్యసభ స్థానాలను కైవసం చేసుకోవాలని బీజేపీ భావిస్తున్నట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశంపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. 'మా ఎమ్మెల్యేలు,అలాగే మా ప్రభుత్వానికి మద్దతునిస్తున్న స్వతంత్రులను లాక్కునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. డబ్బు ఆశజూపి వారిని వారి వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.' అని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యల్లో ఎక్కడా బీజేపీ పేరు ప్రస్తావించనప్పటికీ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాగాల్సిన అవసరం ఎవరికి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఎమ్మెల్యేలు రిసార్టుకు తరలింపు..
ప్రభుత్వ చీఫ్ విప్ మహేష్ జోషి మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్,గుజరాత్,కర్ణాటక,రాజస్తాన్లలో ఏం జరిగిందో ఇక్కడ కూడా అదే జరుగుతోందన్నారు. తమ ఎమ్మెల్యేలను,తమకు మద్దతుగా ఉన్న స్వతంత్రులను వారివైపు తిప్పుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తద్వారా ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికై.. ప్రజల కోసం చిత్తశుద్దితో పనిచేస్తున్న ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తున్నారని ఆరోపించారు.తమ ఎమ్మెల్యేలను బీజేపీ నుంచి కాపాడుకునేందుకు.. ఇప్పటికే వారందరినీ కాంగ్రెస్ పార్టీ జైపూర్లోని ఓ లగ్జరీ రిసార్టుకు తరలించిందన్న వార్తలు కూడా వస్తున్నాయి. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వారితో సమావేశం కానున్నట్టు సమాచారం.రాజ్యసభలో తమ సంఖ్యను పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. కేంద్రం తీసుకొచ్చే బిల్లులు రాజ్యసభలో వీగిపోకుండా ఉండాలంటే పెద్దల సభలోనూ బీజేపీ ఆధిక్యత తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలను బేరసారాల ద్వారా తమవైపుకు తిప్పుకుని.. రావాల్సిన వాటి కంటే ఎక్కువ స్థానాలను దక్కించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
గుజరాత్లోనూ సేమ్ సీన్..
గుజరాత్లోనూ ఈ నెల 19న నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 182 మంది సభ్యులున్న గుజరాత్ అసెంబ్లీలో కాంగ్రెస్కు 65,బీజేపీకి 103 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక రాజ్యసభ స్థానం దక్కించుకోవాలంటే 34 ఓట్లు అవసరం. నిజానికి ఈ ఏడాది మార్చిలో కాంగ్రెస్ సంఖ్యా బలం 73గా ఉంది. అయితే ఆ నెలలో ఐదుగురు,ఇటీవల ఇద్దరు సభ్యులు పార్టీని వీడటంతో సంఖ్యా బలం 66కి పడిపోయింది. ప్రస్తుత లెక్కలను బట్టి చూస్తే కాంగ్రెస్కు ఒకటి,బీజేపీకి 3 స్థానాలు దక్కనున్నాయి. నిజానికి కాంగ్రెస్ పార్టీకి రెండు రాజ్యసభ స్థానాలు దక్కుతాయని అంచనా వేయగా.. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఎమ్మెల్యేలు జారుకున్నారు. బీజేపీ ఆకర్ష్ వల్లే తమ ఎమ్మెల్యేలు జారుకున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.
6)
Recommended Video
ప్రభుత్వం కుప్ప కూలుతుందా?
మధ్యప్రదేశ్లో ఈ ఏడాది మార్చిలో జ్యోతిరాధిత్య సిందియా వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ను వీడి బీజేపీకి మద్దతు పలకడంతో కమల్నాథ్ సర్కార్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత శివరాజ్ సింగ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.ఇక కర్ణాటకలోనూ కుమారస్వామి సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వంలో 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు,ఇద్దరు స్వతంత్రులు రాజీనామా చేయడంతో ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.తాజాప పరిణామాల నేపథ్యంలో రాజస్తాన్లోనూ అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయా అన్న చర్చ జరుగుతోంది.