హోటల్ రాజకీయం: రాజస్థాన్ పోలీసులను అడ్డుకున్న హర్యానా పోలీసులు
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలో రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. అసమ్మతి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమైన గుర్గావ్లోని ఓ హోటల్ వద్దకు చేరుకున్నారు రాజస్థాన్ పోలీసులు. అయితే, వారిని అడ్డుకున్నారు హర్యానా పోలీసులు. సుమారు గంటపాటు ఇక్కడ హైడ్రామా నడిచింది.
రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ప్రయత్నాలు జరుపుతున్నట్లు రెండు ఆడియో టేపులు వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఆడియో టేపుల వ్యవహారానికి సంబంధించి ఎమ్మెల్యే భన్వర్ లాల్ శర్మను ప్రశ్నించేందుకు స్పెషల్ ఆపరేషన్ గ్రూప్(ఎస్ఓజీ) బృందం ఇక్కడకు చేరుకుంది.
కాగా, ఈ ఆడియో టేపుల్లో ఉన్నది సీనియర్ నేత, కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గొంతేనని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే, కాంగ్రెస్ ఆరోపణలను కేంద్రమంత్రి షెకావత్ కొట్టిపారేశారు. ఆ గొంతు తనది కాదని అన్నారు. ఇలాంటి నకిలీ ఆడియో టేపులు తయారు చేయడంలో కాంగ్రెస్ దిట్ట అని, గెహ్లాట్ నివాసంలో ఇలాంటివి చాలానే ఉన్నాయన్నారు. ఎఫ్ఐఆర్లో గజేంద్ర సింగ్ అనే ప్రస్తావించిన పోలీసులు.. ఆయన మంత్రి అని ఎక్కడా పేర్కొనలేదు.
#WATCH: A team of Special Operations Group (SOG) of Rajasthan Police arrives at the resort in Manesar where Congress MLAs are staying. #Haryana pic.twitter.com/Xg1V4aN6xq
— ANI (@ANI) July 17, 2020
ఈ క్రమంలో రాజస్థాన్ ప్రత్యేక పోలీసుల బృందం మనేసర్ హోటల్ దగ్గరికి చేరుకుంది. ఎమ్మెల్యే భన్వర్ లాల్ శర్మను ప్రశ్నించాలని కోరింది. అయితే, హర్యానా పోలీసులు వారిని అడ్డుకున్నారు. గంటపాటు వారిని లోపలికి అనుమతించలేదు. ఆ తర్వాత రాజస్థాన్ పోలీసులను హోటల్ లోపలికి అనుమతించారు. ఓ హోటల్లో సదరు ఎమ్మెల్యే లేరని సిబ్బంది చెప్పడంతో మనేసర్లోని మరో హోటల్కు వెళ్లారు.
ఈ నేపథ్యంలో రాజస్థాన్ కాంగ్రెస్ నేతలు హర్యానాలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. తమ ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన లేకుంటే తమ రాష్ట్రానికి చెందిన తమ ఎమ్మెల్యేలకు ఎందుకు మద్దతు ఇస్తోందని ప్రశ్నించారు. ఏఐసీసీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఇదే విధంగా స్పందించారు.