ఉత్కంఠగా రాజస్థాన్ రాజకీయ సంక్షోభం.. సచిన్ వెంట 30 మంది.. కొందరి యూటర్న్.. సోమవారమే సీఎల్పీ..
రాజస్థాన్ కాంగ్రెస్ లో తలెత్తిన విభేదాలు... రాష్ట్ర ప్రభుత్వాన్ని సంక్షోభంలో పడేశాయి. పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం అయిఉండి కూడా తనకు సరైన ప్రాధాన్యం దక్కడంలేదంటూ సచిన్ పైలట్.. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై తిరుగుబావుటా ఎగరేశారు. దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు సచిన్ కు మద్దతు పలకగా, వారిని వెంటబెట్టుకుని ఆయన ఢిల్లీలో వాలారు. మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియా ఎపిసొడ్ ను తలపిస్తోన్న రాజస్థాన్ సంక్షోభం గంటకో మలుపు తిరుగుతోంది..
కర్ణాటక - ఆంధ్రా బస్సు సర్వీసులకు బ్రేక్.. బెంగళూరులో మళ్లీ పూర్తి లాక్ డౌన్..
గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 200 స్థానాలున్న రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ 107 సీట్లు దక్కించుకుని అధికారం చేపట్టింది. టీబీపీ(2), సీపీఎం(2), ఇండిపెండెంట్లు(2), ఆర్ఎల్డీ(1) కాంగ్రెస్ కు మద్దతిస్తున్నాయి. కాగా, పీసీసీ ప్రెసిడెంట్ గా పార్టీని ఒక్కతాటిపై నడిపించి, దశాబ్దాల తర్వాత విజయం సాధించిపెట్టిన సచిన్ పైలట్ కాకుండా, మళ్లీ అశోక్ గెహ్లాట్ ను సీఎంగా కూర్చోబెట్టడం వివాదాస్పదమైంది. రెండేళ్లు కావస్తున్నా విభేదాలు తగ్గలేదు. తన ప్రాధాన్యం రోజురోజుకూ తగ్గుతుండటంతో సచిన్ తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేశారు. ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకున్న ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ప్రభుత్వం.. సచిన్ కు కూడా నోటీసులు జారీ చేయడంతో ఆయన అసంతృప్తి బద్దలైనట్లు తెలుస్తోంది. అయితే..
సచిన్ పైలట్ తో కలిసి ఢిల్లీకి చేరిన ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పెద్దలు టచ్ లోకి వచ్చారని, రాజస్థాన్ లో పరిస్థితులను చక్కబెట్టే బాధ్యతను రాణదీప్ సుర్జేవాలాకు అప్పగించారని తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని అధినేత్రి సోనియానే పరిష్కరిస్తారని, అప్పటిదాకా అందరూ విభేదాలను పక్కనపెట్టాలని హైకమాండ్ పిలుపునిచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాజస్థాన్ లో పరిస్థితులు మధ్యప్రదేశ్ స్థాయికి ముదరకముందే పరిష్కారం సూచించే దిశగా హైకమాండ్ అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా..
సోమవారం జైపూర్ లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నివాసంలో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ జరుపనున్నారు. నిజానికి ఆదివారమే ఈ భేటీ జరగాల్సి ఉన్నా, సచిన్ వర్గం ఎమ్మెల్యేలు అందుబాటులో లేకపోవడంతో సోమవారానికి వాయిదా పడింది. హైకమాండ్ స్పందన తర్వాత సచిన్ వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు యూటర్న్ తీసుకుని, గెహ్లాటే 5ఏళ్లూ ముఖ్యమంత్రిగా ఉంటారని మీడియాతో అనడం మరో మెరుపు. గెహ్లాట్ సర్కారుకు మద్దతిస్తోన్న ఇండిపెండెంట్లు కూడా ఇప్పుడు సచిన్ వైపునకు మళ్లినట్లు సమాచారం.
Recommended Video
రాజస్థాన్ లో తాజా రాజకీయ పరిణామాలపై సచిన్ పైలట్ కు ఆప్త మిత్రుడు, మధ్యప్రదేశ్ బీజేపీ నేత జ్యోతిరాధిత్య సింధియా అనూహ్య కామెంట్లు చేశారు. ''నా స్నేహితుడు సచిన్ పైలట్ ను కూడా కాంగ్రెస్ పార్టీ సైడ్ చేయడం బాధనిపిస్తోంది. సీఎం గెహ్లాట్ నుంచి కూడా అతను వేధింపులు ఎదుర్కొంటున్నాడు. కాంగ్రెస్ పార్టీలో ప్రతిభకి, సామర్థ్యానికి తగిన గుర్తింపు ఉండదని మరోసారి రుజువైంది''అని సింధియా వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్ లో తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరడం ద్వారా సింధియా.. కమల్ నాథ్ సర్కారును కూలగొట్టడం తెలిసిందే. ఇప్పటి రాజస్థాన్ వ్యవహారం కూడా దాదాపు అలాగే ఉండటం గమనార్హం.