పతనం అంచున కాంగ్రెస్ సర్కార్: 30 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలో సచిన్ పైలట్: జేపీ నడ్డాతో
న్యూఢిల్లీ: రాజస్థాన్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పతనం అంచున నిలిచింది. కర్ణాటక, మధ్యప్రదేశ్ తరహాలో చేతికి అందిన అధికారాన్ని వదులుకోవాల్సిన పరిస్థితులను ఎదుర్కొంటోంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సారథ్యంలోని రాజస్థాన్ సర్కార్.. మైనారిటీలో పడింది. కాంగ్రెస్ పార్టీకి ఉన్న అసలు సిసలు బలమేంటనేది కాస్సేపట్లో తేలిపోనుంది. ఈ ఉదయం 10:30 గంటలకు అశోక్ గెహ్లాట్ నివాసంలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) సభ్యులు సమావేశం కాబోతున్నారు.
కదులుతోన్న ముఖ్యమంత్రి కుర్చీ? 23 మందితో తిరుగుబాటు చేసిన డిప్యూటీ: ఢిల్లీలో మకాం
30 మంది ఎమ్మెల్యేలతో..
ఈ భేటీకి ఎంతమంది ఎమ్మెల్యేలు హాజరవుతారనే అంశం మీదే అశోక్ గెహ్లాట్ ప్రభుత్వ మనుగడ ఆధారపడి ఉంది. ప్రతి సభ్యుడూ సీఎల్పీ భేటీకి హాజరు కావాల్సి ఉంటుందటూ విప్ జారీ చేసింది కాంగ్రెస్. అయినప్పటికీ.. తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఈ భేటీకి హాజరవుతారనేది అనుమానమే. 30 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు లేవనెత్తిన పార్టీ సీనియర్ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ప్రస్తుతం హస్తినలో మకాం వేశారు. పార్టీ అధిష్ఠానాన్ని కలుసుకోవాలని ఆయన భావించినప్పటికీ.. ఆ అవకాశం రాలేదు.
సోనియాగాంధీని కలవాలనుకున్నా..
ఆదివారం నాడే ఆయన తనకు మద్దతు ఇస్తోన్న ఎమ్మెల్యేలతో కలిసి దేశ రాజధానికి ప్రయాణం కట్టారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక అధినేత్రి సోనియాగాంధీ అపాయింట్మెంట్ కోసం రోజంతా వేచి ఉన్నారు. సోనియాగాంధీని కలిసి రాజస్థాన్ కాంగ్రెస్లో నెలకొన్న తాజా పరిణామాలను వివరించాలని భావించారు. ఆ అవకాశం ఆయనకు రాలేదు. సోనియాగాందీ అపాయింట్మెంట్ దొరకలేదు. ఈ పరిస్థితుల్లో సచిన్ పైలట్.. భారతీయ జనతా పార్టీలో చేరుతారనే ప్రచారం ఢిల్లీలో ఊపందుకుంటోంది.
నేడు జేపీ నడ్డాను కలిసే ఛాన్స్
సచిన్ పైలట్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఆయన ఈ మధ్యాహ్నం కలుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తనకు మద్దతు ఇస్తోన్న 30 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి ఆయన బీజేపీ తీర్థాన్ని పుచ్చుకుంటారని చెబుతున్నారు. అదే జరిగితే- రాజస్థాన్.. బీజేపీ చేతుల్లోకి వెళ్లిపోతుంది. 30 మంది ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్బై చెప్పాల్సిన పరిస్థితే వస్తే.. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోతుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ను కోల్పోతుంది.
ఆ రెండు రాష్ట్రాల్లాగే..
ప్రస్తుతం రాజస్థాన్లో కర్ణాటక, మధ్యప్రదేశ్ తరహా రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. అరకొరగా మెజారిటీని సాధించుకుని, ప్రభుత్వాన్ని అయిదేళ్ల కాలం పాటు నడిపించలేకపోతోంది కాంగ్రెస్ పార్టీ. కర్ణాటక, మధ్యప్రదేశ్లల్లో అదే జరిగింది. బొటాబొటి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం..రెండేళ్ల కాలంలోనే దాన్ని బీజేపీకి ధారదాత్తం చేయాల్సిన పరిస్థితులను కాంగ్రెస్ ఎదుర్కొంటోంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలు బుజ్జగింపులకు ఏమాత్రం లొంగకపోవడంతో అశోక్ గెహ్లాట్ సర్కార్ పతనం అంచున నిలిచినట్టయింది.
తిరుగుబాట్లతో సతమతం..
కర్ణాటకలో 17 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామా చేయడంతో జనతాదళ్(సెక్యులర్)తో కలిసి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ కోల్పోవాల్సి వచ్చింది. జ్యోతిరాదిత్య సింధికా రాజీనామా చేయడం వల్ల మధ్యప్రదేశ్లో అధికారాన్ని కోల్పోయింది. అదే తరహాలో ఇప్పుడు రాజస్థాన్ ప్రభుత్వ మనుగడ కూడా ప్రశ్నార్థకమైంది. ఈ మూడుచోట్ల కూడా అధికారాన్ని కోల్పోవడానికి తిరుగుబాటు ఎమ్మెల్యేలే కారణం.
Recommended Video
ఇదంతా బీజేపీ..
మరోవంక అశోక్ గెహ్లాట్.. బీజేపీపై నిప్పులు చెరుగుతున్నారు. పార్టీలో ఈ తరహా పరిస్థితులు నెలకొనడానికి బీజేపీ కారణమంటూ మండిపడుతున్నారు. అధికారాన్ని అడ్డదారుల్లో అందిపుచ్చుకోవడానికి బీజేపీ నేతలు పడరాని పాట్లు పడుతున్నారని విమర్శిస్తున్నారు. ప్రజాస్వామ్యం విలువల గురించి మాట్లాడే బీజేపీ నేతలు.. దానికి తూట్లు పొడుస్తున్నారని, అప్రజాస్వామ్యంగా అధికారాన్ని అందుకుంటున్నారంటూ ఆరోపణలను గుప్పిస్తున్నారు. సీఎల్పీ భేటీకి ఎమ్మెల్యేలందరూ హాజరవుతారనే ధీమాను ఆయన వ్యక్తం చేస్తున్నారు.