సొంత ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం సచిన్ సంచలన వ్యాఖ్యలు
జైపూర్: రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ కీలక నేత సచిన్ పైలట్ సొంత ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కోటలోని జేకే లోన్ ప్రభుత్వ ఆస్పత్రిలో వంద మందికిపైగా శిశువులు మరణించిన విషయం తెలిసిందే. ఈ విషాదకర ఘటనపై బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా.. అన్నింటికీ గత ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదని సొంత ప్రభుత్వానికే చురకలంటించారు.
కోటలోని ప్రభుత్వ ఆస్పత్రిలో నెల రోజుల వ్యవధిలోనే దాదాపు వందమందికిపైగా నవజాత శిశువులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో శిశువుల మరణాలు ఇంకా ఎక్కువగా ఉండేవని, ఇప్పుడు కొంత తగ్గాయని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం వల్లే శిశువుల మరణాలు సంభవించాయని అన్నారు.
కాగా, శిశువుల మరణాలపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ట్వీట్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గెహ్లాట్.. ఆ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హెచ్ఎల్ మీనాను తొలగించారు. వైద్య విద్యా శాఖ కార్యదర్శికి ఆస్పత్రి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో శనివారం కోట ఆస్పత్రిని సందర్శించారు డిప్యూటీ సీఎం సచిన్ పైలట్.
అనంతరం సచిన్ మాట్లాడుతూ.. ఇది చాలా సున్నితమైన అంశమని, శిశువుల మరణానికి మనమే బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 13 నెలలు గడిచిన తర్వాత కూడా గత ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదని ముఖ్యమంత్రికి చురకలంటించారు.
జవాబుదారితనం పెరగాలని, గతం గురించి మాట్లాడకూడదని అన్నారు. గత ప్రభుత్వం చేసిన పొరపాట్లను చేయకూడదని అన్నారు. అందుకే వారిని అధికారానికి దూరం పెట్టారని అన్నారు. రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన సచిన్ పైలట్.. సొంత ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారాయి.