మరో మధ్యప్రదేశ్ కానీ రాజస్తాన్, తిరుగుబాటు చేసి..దారిలోకి వచ్చిన పైలట్, ఊపిరి పీల్చిన గెహ్లట్..
రాజస్తాన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అస్థిరత నెలకొంది. సీఎం అశోక్ గెహ్లాట్పై డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తిరుగుబాటు ఎగరవేశారు. అయితే రాజస్తాన్ మరో మధ్యప్రదేశ్ మాత్రం కాలేదు. తిరిగి సచిన్ పైలట్ సొంతగూటికి వచ్చారు. దీంతో గెహ్లాట్ సర్కార్ అంపశయ్య నుంచి ఊపిరి పీల్చుకుంది. ఇందుకు రకరకాల కారణాలు కూడా ఉన్నాయి. అందుకు పైలట్కు కాలం కలిసిరాలేదు. బీజేపీలో చేరదామంటే సీఎం పోస్టుపై క్లారిటీ లేదు. అక్కడ వసుంధర రాజే బలంగా ఉండటంతో పైలట్ పప్పులు ఉడకలేవు. రాజస్తాన్ ప్రభుత్వ అస్థిరత గురించి తెలుసుకుందాం. పదండి..
సంక్షేమం నుంచి సంక్షోభం వరకు..
ఈ ఏడాది జూలైలో రాజస్తాన్ ప్రభుత్వంలో కుదుపు.. సచిన్ పైలట్ తిరుగుబాటు. అంతకుముందే జ్యోతిరాదిత్య సిందియా పార్టీని వీడటంతో మధ్యప్రదేశ్లో ప్రభుత్వమే కూలింది. కానీ ఇక్కడ అలా కాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేసింది. వారికి సమయం కూడా అలా కలసి వచ్చింది. రాజస్తాన్ పీసీసీ చీఫ్గా పైలట్ ఉన్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్న తనకు విధానపర విషయాలు తెలియనీయలేదని వాపోయారు. పార్టీలో ప్రభ తగ్గుతోందని భావించి.. దూరంగా ఉన్నారు. తన వర్గ ఎమ్మెల్యేలను వెంట తీసుకొచ్చారు. దీంతో ప్రభుత్వంలో కుదుపు వచ్చింది. పైలట్ను దారిలోకి తీసుకొచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
నెలరోజులపాటు అస్థిరత్వం..
రాజస్తాన్లో నెలరోజులపాటు ప్రభుత్వం అస్థిరత్వంలో ఉంది. పైలట్ కూడా బీజేపీలో చేరతానని అనుకొన్నారు. కానీ అక్కడ పైలట్ పప్పులు ఉడకేలా కనిపించడం లేదు. ఎందుకంటే అక్కడ వసుంధర రాజే బలంగా ఉన్నారు. పైలట్ను పార్టీలోకి ఆహ్వానించే పరిస్థితి లేదు. ఒకవేళ తీసుకొచ్చినా ఆశించిన ప్రయోజనం దక్కదు. ఈ విషయాన్ని పైలట్కు నేరుగానే చెప్పడంతో ఆయన వెనకడుగు వేశారు. నెలరోజులకు పైగా అస్థిరత్వం కొనసాగింది. చివరికీ ప్రియాంక, రాహుల్ గాంధీ.. పైలట్తో సంప్రదింపులు జరిపారు. పార్టీలో ప్రాధాన్యం ఇస్తామని.. కేంద్రంలో ఉండి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. గెహ్లట్తో దూరంగా ఉంచి.. పరిస్థితిని అప్పటివరకు చక్కదిద్దారు.
ఏం చేయలేక..
అటు బీజేపీ నుంచి స్పష్టత కొరవడటం.. ఇటు రాహుల్ సంప్రదింపులతో పైలట్ మెత్తబడ్డారు. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో రాజస్తాన్ ప్రభుత్వంలో నెలకొన్న సంక్షోభం టీ కప్పులో తుఫానుగా మారింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఊపిరి పీల్చుకుంది. పరువు కాపాడుకుంది. కానీ మళ్లీ తిరగబడే అవకాశం కూడా ఉంది. గెహ్లట్-పైలట్ మధ్య చెడితే చాలు.. మరోసారి ప్రభుత్వంలో అస్థిరత్వం రావడం ఖాయం. కానీ అదీ వస్తోందో రాదో మాత్రం చెప్పలేం.
Recommended Video
టెక్ ఎ బ్రీత్..
రాజస్తాన్ అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 200 మంది. సభలో బల నిరూపణకు 101 మంది సభ్యుల మద్దతు తప్పనిసరి. బీజేపీకి 75 మంది సభ్యులు ఉండగా.. కాంగ్రెస్ 107 సీట్లతో బలంగా ఉంది.13 మంది ఇండిపెండెంట్లు కూడా సపోర్ట్ చేస్తున్నారు. దీంతో గెహ్లట్ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదు. కానీ తీర్మానం ప్రవేశపెట్టకముందే అనిశ్చితి వీడింది. పైలట్ సొంతగూటికి రావడంతో.. గెహ్లట్ సర్కార్ ఊపిరి తీసుకుంది.