పెట్రోల్ రేట్ రూ.వంద మార్క్ను దాటిన వేళ..ప్రభుత్వం సంచలన నిర్ణయం: రాష్ట్రాలకు సంకేతాలు
జైపూర్: దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. ఆల్ టైమ్ రికార్డ్ను సృష్టిస్తున్నాయి..బిత్తరపోయేలా చేస్తోన్నాయి. వాహనాలను రోడ్ల మీదికి తీసుకుని రావడానికే దడ పుట్టించేలా మారాయి. పెట్రోల్ లీటర్ ఒక్కింటికి వంద రూపాయల మార్క్ను దాటింది. 101 రూపాయలకు చేరింది. రాజస్థాన్లోని శ్రీ గంగానగర్లో గురువారం నాటి పెట్రోల్ ధర నూటొక్క రూపాయలు దాటిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలకు దిగింది. కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పెట్రోల్, డీజిల్పై రెండు శాతం మేర విలువ ఆధారిత పన్నును తగ్గించింది.
ఈ మేరకు రాజస్థాన్లో ముఖ్యమబత్రి అశోక్ గెహ్లాట్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఫలితంగా 38 శాతం మేర ఉన్న వ్యాట్.. 36 శాతానికి చేరింది. డీజిల్పై 28 శాతం మేరకు ఉన్న వ్యాట్ 26 శాతానికి తగ్గింది. ఈ ఉత్తర్వులు గురువారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. దీని ప్రభావంతో పెట్రోల్, డీజిల్ రేట్లు కాస్త తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం జైపూర్లో లీటర్ పెట్రోల్ ఒక్కింటికి 92.51, డీజిల్ 84.62 రూపాయలకు చేరింది. పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ ఇంకా కొనసాగుతోంది.
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పేరుతో ఒకేరకమైన పన్ను విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినప్పటికీ.. ఇందులో పెట్రో ఉత్పత్తులను చేర్చలేదు. ఫలితంగా- వ్యాట్ ఆధారంగానే వాటి ధరల్లో రోజువారీ మార్పులు సంభవిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ బ్యారెల్ ధరల ఆధారంగా దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లల్లో కదలికలు నమోదవుతుంటాయి. రాష్ట్రాలు విధించే అమ్మకపు పన్ను దీనికి అదనం. పెట్రో ఉత్పత్తుల ధరలను పర్యవేక్షించే బాధ్యత చమురు కంపెనీలదే. పెట్రో ఉత్పత్తుల రేట్లు భారీగా పెరుగుతోన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది.
Recommended Video
వాటిని నియంత్రించడానికి తక్షణ చర్యలను తీసుకోవాల్సి ఉంటుంది. మోడీ సర్కార్ అవేవీ పట్టించుకోవట్లేదనే విమర్శలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ రేట్లు 89 రూపాయలకు పైమాటే పలుకుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాలు వ్యాట్ను తగ్గించుకోవడం ద్వారా వాహనదారులకు కాస్త ఉపశమనాన్ని కల్పించవచ్చనే సందేశాన్ని రాజస్థాన్ ప్రభుత్వం పంపించినట్టయింది. వాహనదారులు ఎదుర్కొంటోన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వ్యాట్ను తగ్గిస్తాయా? లేదా? అనేది తేలాల్సి ఉంది.