రాజస్తాన్ రాజకీయ సంక్షోభంలో కీలక పరిణామం... గవర్నర్ నుంచి గెహ్లాట్కు గ్రీన్ సిగ్నల్...
రాజస్తాన్ రాజకీయ సంక్షోభంలో మొదటిసారి గవర్నర్ కల్రాజ్ మిశ్రా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రతిపాదన పట్ల సానుకూలంగా స్పందించారు. అగస్టు 14న అసెంబ్లీ సమావేశాలకు ఆయన అనుమతినిచ్చారు. ఇప్పటికీ మూడుసార్లు అశోక్ గెహ్లాట్ ప్రతిపాదనలను ఆయన తిరస్కరించారు. షార్ట్ నోటీసుతో అసెంబ్లీని సమావేశపరచడం కుదరదని,కనీసం 21 రోజుల వ్యవధితో కూడిన నోటీసులు అవసరమని గెహ్లాట్కు స్పష్టం చేశారు.
గవర్నర్ కండిషన్స్ నేపథ్యంలో అశోక్ గెహ్లాట్ మరోసారి అసెంబ్లీ సమావేశాలపై ఆయనకు లేఖ రాశారు. అగస్టు 14వ తేదీ నుంచి సమావేశాలకు అనుమతినివ్వాలని కోరారు. జూలై 23వ తేదీన మొదటిసారి గవర్నర్కు ప్రపోజల్స్ పంపిన తేదీ నుంచి 21 రోజుల నోటీస్ పీరియడ్ను లెక్క కట్టి తాజా ప్రపోజల్ పంపించారు. అంతకుముందు,బుధవారం(జూలై 29) సాయంత్రం ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆధ్వర్యంలో సమావేశమైన కేబినెట్ అసెంబ్లీ సమావేశాలకు తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా రాజ్భవన్లో కల్రాజ్ మిశ్రాను కలిసి అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుపై చర్చించారు. దీంతో ఎట్టకేలకు గవర్నర్ నుంచి సానుకూల స్పందన వచ్చింది.
అంతకుముందు గవర్నర్ మిశ్రాపై అశోక్ గెహ్లాట్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ నుంచి మిశ్రాపై రాజకీయ ఒత్తిడి ఉందని,అందుకే అసెంబ్లీని సమావేశపరిచేందుకు అనుమతినివ్వట్లేదని ఆరోపించారు. బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ని కలిసి ఇదే విషయంపై వినతిపత్రాన్ని కూడా అందజేశారు. రాజస్తాన్ పరిణామాల్లో జోక్యం చేసుకోవాలని కోరారు.
Recommended Video
కాగా,ముఖ్యమంత్రిపై తిరుగుబాటు చేయడంతో సచిన్ పైలట్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. సచిన్ పైలట్తో పాటు ఆయనకు మద్దతిస్తున్న 18 ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ అనర్హత వేటు వేయగా.. వారు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు దీనిపై స్టే ఇవ్వడంతో సచిన్ పైలట్కు ఊరట లభించినట్లయింది. దీనిపై కాంగ్రెస్ సుప్రీంను ఆశ్రయించగా హైకోర్టును నిలువరించలేమని స్పష్టం చేసింది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉంది.