ముఖ్యమంత్రి కోరింది..గవర్నర్ నెరవేర్చారు: కండిషన్స్ అప్లై: సీఎం ఏం చెబుతారో మరి?
జైపూర్: రాజస్థాన్లో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఓ కొల్లిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ డిమాండ్ పట్ల గవర్నర్ కల్రాజ్ మిశ్రా సానుకూలంగా స్పందించారు. అసెంబ్లీని సమావేశ పర్చాలనే ఏకైక డిమాండ్తో అటు న్యాయస్థానాల్లో.. ఇటు రాజ్యంగ వ్యవస్థతో నాలుగైదు రోజులుగా అశోక్ గెహ్లాట్ సాగిస్తోన్న పోరాటానికి తెర పడినట్టే. శాసనసభను సమావేశపర్చి, తన బలాన్ని నిరూపించుకోవడానికి గెహ్లాట్ చేస్తోన్న ప్రయత్నాలు, పోరాటాలు ఎట్టకేలకు ఫలించాయి. అసెంబ్లీని సమావేశపర్చడానికి గవర్నర్ కొద్దిసేపటి కిందటే ఉత్తర్వులు జారీ చేశారు.
గవర్నర్కే వార్నింగ్ ఇచ్చిన సీఎం: రాజ్భవన్ను ఎవరైనా ముట్టడించ వచ్చు.. బాధ్యత మాది కాదు
ఈ మేరకు రాజ్భవన్ కార్యదర్శి ఓ ప్రకటన జారీ చేశారు. సభను సమావేశపర్చకుండా అడ్డుకోవాలనేది తన ఉద్దేశం కాదని గవర్నర్ ఈ స్పష్టం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవడం వల్ల వెంటనే ఉత్తర్వుల జారీ చేయలేకపోయాననే విషయాన్ని గవర్నర్ కల్రాజ్ మిశ్రా ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. 21 రోజుల నోటీసును ప్రభుత్వం అంగీకరించాల్సి ఉంటుందని మెలిక పెట్టినట్లు సమాచారం.
దీనిపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఇంకా తెలియరావాల్సి ఉంది. 21 రోజుల నోటీసుకు అశోక్ గెహ్లాట్ అంగీకరించకపోవచ్చని తెలుస్తోంది. వెంటనే సభను సమావేశపర్చడానికి గెహ్లాట్ తీవ్ర ఒత్తిళ్లను తీసుకొస్తున్నారని, ఆయన ప్రధాన డిమాండ్ అదే కావడం వల్ల 21 రోజుల నోటీసుకు సానుకూలంగా స్పందించకపోవచ్చని చెబుతున్నారు. దీనితో పాటు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో భౌతికదూరాన్ని ఎలా పాటిస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వాలని కూడా గవర్నర్ తన ఆదేశాల్లో పొందుపరిచినట్లు సమాచారం.
అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ అడ్డుపడుతున్నారంటూ అశోక్ గెహ్లాట్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలకు ఫిర్యాదు చేసిన మరుసటి రోజే గవర్నర్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అసెంబ్లీని సమావేశపర్చాలని ఆదేశించారు. గవర్నర్ అనుమతి ఇస్తే గానీ.. అసెంబ్లీని సమావేశపర్చడం సాధ్యం కాదని, ఆయన మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అశోక్ గెహ్లాట్ నిప్పులు చెరుగుతున్నారు.
Rajasthan Governor Kalraj Mishra orders State Government to call for an Assembly Session. Not convening the Assembly was never the intention: Raj Bhawan, Rajasthan pic.twitter.com/mKt2qdmuSp
— ANI (@ANI) July 27, 2020
కల్రాజ్ మిశ్రాపై కొన్ని రాజకీయ శక్తుల ఒత్తిడి ఉందని, అందుకే ఆయన అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని మండిపడుతున్నారు. అసెంబ్లీ భేటీ కోసం అశోక్ గెహ్లాట్ ఇప్పటికే రెండుసార్లు గవర్నర్ను సంప్రదించారు. శుక్రవారం ఆయన రాజ్భవన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో నిరసన కార్యక్రమాలను సైతం నిర్వహించారు. ఈ ఉదయం మరోసారి గవర్నర్ను కలిశారు. అసెంబ్లీ భేటీకి అవకాశం ఇవ్వాలని విజ్ఙప్తి చేశారు. ఈ రెండు సందర్భాల్లోనూ గవర్నర్ నుంచి తిరస్కారమే ఎదురైంది.