రాజస్తాన్ సంక్షోభం... ఎట్టకేలకు కాంగ్రెస్కు గవర్నర్ సానుకూల కబురు... కండిషన్స్ అప్లై...
రాజస్తాన్ రాజకీయ సంక్షోభానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో అర్థం కావట్లేదు. అసెంబ్లీ ఏర్పాటుకు గవర్నర్ నుంచి ఆమోదం లభించకపోవడం,ఎమ్మెల్యేలపై అనర్హత వేటును చట్టపరంగా ఎదుర్కోవడంలో స్పీకర్ వెనక్కి తగ్గడం,రాజకీయ కుట్రలు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్ రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడం వంటి పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ప్రభుత్వాన్ని కూల్చాలన్న కుట్రలకు గవర్నర్ సహకరిస్తున్నారని కాంగ్రెస్ బహిరంగంగానే ఆరోపణలు చేస్తోంది. అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుకు ఇదివరకే నోటీసులిచ్చినా కల్రాజ్ మిశ్రా ప్రతికూలంగా స్పందించడంతో ఆ పార్టీ తీవ్ర ఆగ్రహంతో ఉంది. అయితే ఎట్టకేలకు గవర్నర్ నుంచి కాంగ్రెస్కు ఓ సానుకూల కబురు అందింది.
Recommended Video
గవర్నర్ ఏమన్నారు....
అసెంబ్లీ సమావేశాలకు సిద్దం కావాలని రాజస్తాన్ గవర్నర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కబురు అందించారు. సమావేశాలను అడ్డుకోవడం తమ ఉద్దేశం కాదన్నారు. అయితే సమావేశాల ఏర్పాటుకు 3 కీలక అంశాలను పాటించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం 21 రోజుల వ్యవధితో అసెంబ్లీ సమావేశాలకు నోటీసులు ఇవ్వాలని సూచించారు. కరోనా వైరస్ నేపథ్యంలో షార్ట్ నోటీసుతో ఎమ్మెల్యేలందరిని అసెంబ్లీ సమావేశాలకు పిలవలేమని చెప్పారు.
బలపరీక్షపై గవర్నర్ కామెంట్స్...
ఒకవేళ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెడితే... వీడియో రికార్డింగ్ చేపట్టడం,ఓటింగ్ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేయడం, అవును లేదా నో బటన్ల ద్వారా మాత్రమే ఈ ప్రక్రియను చేపట్టడం వంటి నిబంధనలను చేర్చగలరా? అని గవర్నర్ ప్రశ్నించారు.అసెంబ్లీ సమావేశాల్లో భౌతిక దూరం వంటి నిబంధనలు ఎలా పాటిస్తారో చెప్పాలన్నారు. అసెంబ్లీ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే రెండుసార్లు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రతిపాదనలు తిరస్కరించిన గవర్నర్... తాజాగా షరతులతో కూడిన క్లియరెన్స్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
మండిపడుతున్న కాంగ్రెస్...
గవర్నర్ తీరుపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. రాజ్యాంగబద్దంగా వ్యవహరించాల్సిన గవర్నర్ ఆయన పరిధి దాటి వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేతలు,మాజీ న్యాయశాఖ మంత్రులు కపిల్ సిబిల్,సల్మాన్ ఖుర్షీద్,అశ్వని కుమార్లు మండిపడ్డారు. దీనిపై గవర్నర్ కల్రాజ్ మిశ్రాకు లేఖ కూడా రాశారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గత 70 ఏళ్లలో ఏ గవర్నర్ ఇలా వ్యవహరించలేదని విమర్శించారు.
రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని...
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని లేఖలో పేర్కొన్నారు. గవర్నర్లను పావులుగా ఉపయోగించుకుంటూ ప్రభుత్వాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. రాజస్తాన్ రాజకీయ ప్రతిష్టంభనకు తెరదించాలంటే వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు.