లిక్కర్ కిక్కు తగ్గేలా మరో షాక్: మద్యంపై 45 శాతం ఎక్సైజ్ సుంకం పెంచిన సర్కార్: కరోనా ఎఫెక్ట్ మరి..!
జైపూర్: ప్రాణాంతక కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా రెండోదశ లాక్డౌన్ కొనసాగుతోంది. తొలివిడత ప్రకటించిన 21 రోజుల లాక్డౌన్ను మరో 19 రోజులపాటు పొడిగించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మొత్తంగా 40 రోజుల పాటు దేశం మొత్తం స్తంభించిపోయింది. ఎక్కడి కార్యకలాపాలు అక్కడే స్తంభించిపోయాయి. వ్యాపార, వాణిజ్యం, సేవా రంగాలు, బ్యాంకింగ్ సెక్టార్, పరిశ్రమలు.. ఇలా అన్ని మూతపడ్డాయి. ఫలితంగా కేంద్రానికి గానీ, రాష్ట్రానికి గానీ పన్నుల రూపంలో రావాల్సిన ఆదాయం అడుగంటింది.
ఆర్థిక వనరుల అన్వేషణలో..
కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాల ప్యాకేజీలను ప్రకటించినప్పటికీ.. అవి దేశ ప్రజల కోసమే. వారి సంక్షేమాన్ని ఉద్దేశించినవే. ఇప్పటిదాకా ఇచ్చిన కొన్ని ప్రోత్సాహకాలు కూడా ఒక సెక్టార్కు మాత్రమే పరిమితం అయ్యాయి. లాక్డౌన్ ఇబ్బందుల నుంచి కోలుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా రాష్ట్రాలకు పెద్దగా ఆర్థిక ఊతాన్ని ఇచ్చిన సందర్భాలు లేవు. ఫలితంగా- ఇక రాష్ట్రాలు తమకు తాముగా ఆర్థిక వనరులను పెంచుకునే ప్రయత్నాలకు దిగాయి.
మద్యంపైనే గురి..
ఏ రాష్ట్రానికైనా అందుబాటులో ఉన్న ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటి మద్యం అమ్మకాలు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయమే అధికంగా ఉంటోంది కొన్ని రాష్ట్రాల్లో. సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తోన్న గుజరాత్, తాకితేనే షాక్ కొట్టేలా మద్యం ధరలను నిర్దేశించిన ఏపీ వంటి రాష్ట్రాలను ఈ కేటగిరీల నుంచి మినహాయించవచ్చు. ప్రస్తుతం కంటికి కనిపించే ప్రధాన ఆదాయ వనరు మద్యం అమ్మకాలే కావడం వల్ల వాటిపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు.
శ్రీకారం చుట్టిన రాజస్థాన్..
మద్యం అమ్మకాల ద్వారా ఆదాయన్ని పెంచుకునే ప్రయత్నాలకు రాజస్థాన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. లిక్కర్ విక్రయాలపై ఇప్పుడున్న ఎక్సైజ్ సుంకాన్ని కళ్లు తిరిగేలా పెంచింది. భారత్లో తయారయ్యే విదేశీ మద్యం (ఐఎంఎఫ్ఎల్)పై 35 శాతం, భారత్లో విక్రయించే విదేశీ మద్యంపై 45 శాతం రేట్లను పెంచుతూ రాజస్థాన్ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. దీనవల్ల ఏటా 1700 కోట్ల రూపాయల అదనపు ఆదాయం ఖజానాకు అందుతుందని అంచనా వేసింది అక్కడి అశోక్ గెహ్లాట్ సర్కార్.
లైసెన్స్డ్ తయారీలపైనా
ఐఎంఎఫ్ఎల్ మద్యంపై పెంచిన ఎక్సైజ్ సుంకం వల్ల 800 కోట్ల రూపాయలు, విదేశీ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ సుంకం పెంపు వల్ల 900 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని భావిస్తోంది. మద్యాన్ని తయారు చేయడానికి జారీ చేసే లైసెన్స్ ఛార్జీలను కూడా భారీగా పెంచింది. లైసెన్స్ తీసుకుని రాష్ట్రంలోనే తయారయ్యే మద్యం విక్రయాలను కూడా పెంపు పరిధిలోకి తీసుకొచ్చింది. దీనివల్ల మరో 500 కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తుందని అంచనా వేసింది.
మిగిలిన రాష్ట్రాలూ అదే బాటలో..
తమ ఆదాయ వనరులను పెంచుకోవడానికి ఇప్పటికే అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకోవడానికి సిద్ధపడుతున్నాయి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు. కరోనా వైరస్ మిగిల్చిన నష్టం నుంచి బయటపడటానికి మద్యం ధరలను భారీగా పెంచడం వైపే మొగ్గు చూపుతున్నాయి. ఫలితంగా- దాదాపు అన్ని చోట్లా మద్యం ధరలకు రెక్కలు మొలిచే అవకాశాలు లేకపోలేదు. ఈ పరిణామాలు కాస్తా మద్యపాన ప్రియులకు సంకటాన్ని మిగిల్చడం ఖాయంగా కనిపిస్తోంది.