అవమానకరంగా..: 'నేను పేదవాడిని.. రేషన్ తీసుకుంటున్నా'
ప్రభుత్వ పథకాల అమలులో అక్రమాలను అరికట్టే క్రమంలో అధికారులు ప్రవర్తించిన తీరు విమర్శలకు తావిచ్చింది. లబ్ధిదారుల ఇళ్ల పైన వీరు పేదవారు అని రాశారు.
జైపూర్: ప్రభుత్వ పథకాల అమలులో అక్రమాలను అరికట్టే క్రమంలో అధికారులు ప్రవర్తించిన తీరు విమర్శలకు తావిచ్చింది. లబ్ధిదారుల ఇళ్ల పైన వీరు పేదవారు అని రాశారు.
ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసా జిల్లాలో చోటు చేసుకుంది. దీనిపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
పేదలకు చౌకగా ఆహార పదార్థాలను అందించేందుకు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ చట్టం కింద సంక్షేమ పథకం అమలులో ఉంది. రేషన్ ద్వారా సరకులను పేద ప్రజలకు పంపిణీ చేస్తారు. అయితే చాలా ప్రాంతాల్లో ఈ సబ్సీడీ సరకులు పేదలకు చేరకుండా మధ్యవర్తులు దోచుకుంటున్నారు.
రాజస్థాన్లోని దౌసాలోనూ ఇలా సంక్షేమ పథకాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపణలు రావడంతో అఖ్కడి అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా వారు తీసుకున్న నిర్ణయంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లబ్దిదారులను గుర్తించేందుకు వీలుగా రేషన్ వస్తువులు తీసుకుంటున్న వారి ఇళ్ల గోడలపై 'నేను పేద కుటుంబానికి చెందిన వాడిని' అనే నినాదాన్ని రాయించారు. ఈ చర్యలతో అందరూ కంగుతిన్నారు.
అంతేకాదు, లబ్దిదారులు తమకు తాముగానే 'నేను పేదవాడిని' అని తమ ఇంటి గోడలపై పెయింట్ వేసుకుంటే వారికి రూ. 750 ఇస్తామని అధికారులు తెలిపారు. దీంతో అధికారులు అవమానిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు.