దారుణం... మైనర్ బాలిక సహా ఒకే కుటుంబంలో నలుగురిపై అత్యాచారం...
రాజస్తాన్లో ఓ సంచలన కేసు వెలుగుచూసింది. ఓ మైనర్ బాలిక సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లుగా కేసు నమోదైంది. మొదట ఆ కుటుంబానికి చెందిన ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ అతను... ఆ తర్వాత మిగతా ముగ్గురిని కూడా ట్రాప్ చేసినట్లు ఆరోపణలున్నాయి.
వివరాల్లోకి వెళ్తే... రాజస్తాన్లోని దౌసా జిల్లాలో విష్ణు గుర్జార్ అనే వ్యక్తి సొంతంగా దాబా నిర్వహిస్తున్నాడు. ఆ దాబాకు సమీపంలో ఓ మహిళ ఇల్లు ఉంది. తన ఇద్దరు చెల్లెళ్లు,కూతురితో ఆమె అక్కడే నివసిస్తోంది. ఆ మహిళపై కన్నేసిన విష్ణు మొదట ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను బెదిరింపులకు గురిచేస్తూ ఏడాది కాలంగా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడుతూ వస్తున్నాడు.
ఇదే క్రమంలో ఆమె ఇద్దరు చెల్లెళ్లు,మైనర్ అయిన ఆమె కుమార్తెపై కూడా అతని కన్ను పడింది. నయానో... భయానో... వారిని కూడా ట్రాప్ చేయాలని భావించాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళ ఈ నెల 21న అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై అతను అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. ఇదే నెల 23,24 తేదీల్లో ఆమె ఇద్దరు చెల్లెళ్లు కూడా అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపై కూడా అతను అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు,తమ సోదరి కుమార్తెపై కూడా అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు విష్ణుపై కేసు నమోదు చేశారు. ఒకే కుటుంబంలో నలుగురిపై అత్యాచార ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
రెండు రోజుల క్రితం ఇదే రాజస్తాన్లోని కోటా జిల్లాలో కన్న కూతురి పైనే తండ్రి అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. 10 ఏళ్ల వయసున్న ఆ బాలికపై 30 ఏళ్ల వయసున్న ఆ తండ్రి గత 3,4 నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. భార్యతో విభేదాలతో ఆమెను వదిలేసిన అతను... పిల్లలను మాత్రం తన వద్దే ఉంచుకున్నాడు. ఈ క్రమంలో ఇటీవల సంక్రాంతి పండుగ రోజు మద్యం మత్తులో 10 ఏళ్ల తన కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం స్థానికుల ద్వారా పోలీసులకు తెలియడంతో ఈ ఘటన వెలుగుచూసింది.