ఉల్లిగడ్డ తినకుంటే చచ్చిపోతామా:మంత్రి వివాదాస్పదం
జైపూర్: రాజస్థాన్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రభు లాల్ సైని ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యల పైన ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది.
ఆయన ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ... మనం ఉల్లిగడ్డలు తినకుంటే చనిపోం కదా అని వ్యాఖ్యానించారు. ఉల్లిగడ్డ ధరలు విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. కిలో రూ.50 వరకు ఉంది. దీంతో, సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు.
ఉల్లిగడ్డల ధరల పెరుగుదల పైన సామాన్యులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.... ఉల్లిపాయలు తినకుంటే చచ్చిపోతారా అని వ్యాఖ్యానించారు.
రైతులు, నియోజకవర్గ ప్రజలతో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ప్రభులాల్ సైని వ్యాఖ్యానించారు. జనాలు ఉల్లిగడ్డ ధర పెరుగుదలపై ప్రశ్నించగా ఆయన పైవిధంగా స్పందించారు. ఓ నాలుగైదు రోజులు ఉల్లిపాయలు తినకపోతే చస్తామా అన్నారు.
దీంతో, మంత్రి తీరు పైన కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది. ధరలను అదుపు చేయలేక ఉల్లిగడ్డలు తినవద్దని చెప్పడం విడ్డూరమన్నారు. రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటడీ ఉపాధ్యక్షులు అర్చన శర్మ మాట్లాడుతూ... మంత్రి వ్యాఖ్యలు ఖండిస్తున్నట్లు చెప్పారు.