స్వచ్ఛభారత్ ప్రజలకే పాలకులకు కాదు: బహిరంగ మూత్ర విసర్జన చేసిన మంత్రిపై విమర్శల వెల్లువ
ఓ వైపు స్వచ్ఛ భారత్ కార్యక్రమంతో మోడీ దేశాన్ని శుభ్రత వైపు నడిపించే ప్రయత్నం చేస్తుంటే సొంత పార్టీ నేతలే ఈ కార్యక్రమానికి తూట్లు పొడుస్తున్నారు. తాజాగా రాజస్థాన్కు చెందిన మంత్రి శంభుసింగ్ ఖేటాసర్ బహిరంగ మూత్ర విసర్జన చేస్తూ కెమెరా కంటికి చిక్కారు. ఒక మంత్రిగా ఉంటూ నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి ఇలా బహిరంగ మూత్ర విసర్జన చేయడమేంటి అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి మంత్రిగారి వ్యవహారం ఇటు బీజేపీని ఇరుకున పెట్టడమే కాదు.. అటు విపక్షాలు దుమ్మెత్తి పోసేందుకు అవకాశం ఇచ్చింది.
ముందు జేజేలు...ఆ తర్వాత ఛీత్కారాలు
రాజస్థాన్లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈసీ ఎన్నికల తేదీలను ప్రకటించడంతో నేతలు ప్రచారంలో తలమునకలయ్యారు. ఇందులో భాగంగానే రాజస్థాన్ మంత్రి శంభుసింగ్ ఖేటాసర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఉదయం నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన అంతవరకు ప్రజల చేత జేజేలు కొట్టించుకున్నారు. అప్పటి వరకు జేజేలు కొట్టించుకున్న మంత్రి వర్యులు ఒకే ఒక ఘటనతో ఛీఛీ అనిపించుకున్నారు. బిజీగా జనం మధ్య ఉన్న నేత ఒక్కసారిగా కనిపించకపోయేసరికి ర్యాలీలో ఉన్నవారు అవాక్కయ్యారు. మంత్రి ఎక్కడికెళ్లారంటూ ఆరా తీశారు. ఒక్కసారి పక్కకు చూడగా మంత్రి శంభుసింగ్ హాయిగా పాటపాడేస్తున్నారు... అదే మూత్ర విసర్జన చేస్తున్నారు. బహిరంగ ప్రదేశంలో మంత్రిగారు మూత్రవిసర్జన చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
వసుంధర రాజే పోస్టర్ పక్కనే మూత్ర విసర్జన చేసిన మంత్రి
ప్రధాన మంత్రి మోడీ స్వచ్చ భారత్ కోసం అంత కష్టపడి పనిచేస్తుంటే ఇలాంటి వ్యక్తులు కొందరు దాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారని ర్యాలీలో ఉన్నవారు చాలామంది మాట్లాడుకున్నారు. ఇక మంత్రి గారి సుందర దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఫోటోలో శంభు సింగ్ బీజేపీ ముఖ్యమంత్రి వసుంధర రాజే పోస్టర్ ఉన్న చోటే మూత్ర విసర్జన చేయడం అటు ఆమె అభిమానులకు కూడా ఆగ్రహం తెప్పించింది. ఇక సోషల్ మీడియాలో అయితే శంభు సింగ్ను నెటిజెన్లు ఓ ఆటాడేసుకున్నారు. మంత్రికి చివాట్లు పెట్టారు.
బహిరంగ ప్రదేశాల్లో మూత్రవిసర్జన చేయడం అనాదిగా వస్తున్న ఆచారం
సోషల్ మీడియాలో నెటిజెన్లు దుమ్మెత్తిపోస్తుండటంతో ఎట్టకేలకు శంభుసింగ్ స్పందించారు. మూత్ర విసర్జన బహిరంగ ప్రదేశాల్లో చేయడం అనాదిగా వస్తున్న ఆచారం అంటూ తిక్కవాగుడు వాగారు. తాను మూత్ర విసర్జన చేసినట్లు ఒప్పుకున్న శంభుసింగ్ ... పోస్టర్ మీద మాత్రం చేయలేదని చెప్పారు. అంతేకాదు ఓ గోడ దగ్గర తాను మూత్ర విసర్జన చేసినట్లు చెప్పిన శంభు సింగ్ అది ర్యాలీకి చాలా దూరంలో ఉందని... అది నిర్మానుష్య ప్రాంతమని చెప్పి కలరింగ్ ఇచ్చారు. బహిర్భూమి, మూత్రవిసర్జన రెండు వేర్వేరు అంశాలని మంత్రి వివరణ ఇచ్చారు. బహిరంగ ప్రదేశాల్లో బహిర్భూమికి వెళ్లడం వల్ల వ్యాధులు వ్యాపిస్తాయి కానీ... మూత్ర విసర్జన చేస్తే జబ్బులు రావనే సమాధానం చెబుతున్నారు మంత్రి వర్యులు. ఈ సమాధానంతో నెటిజెన్లు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంత్రిగారిపై దుమ్మెత్తిపోశారు. దగ్గరలో ఎక్కడా టాయ్లెట్స్ లేకపోవడంతో నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న గోడచాటున మూత్రవిసర్జన చేయాల్సి వచ్చిందని చెప్పారు.