16మంది మంత్రులకు బెదరింపు మెయిల్స్: దాడులు తప్పవన్న ఐఎం
న్యూఢిల్లీ/జైపూర్: రాజస్థాన్లో పలువురు మంత్రులకు బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చాయని ఆ రాష్ట్ర డిజిపి ఒమేంద్ర భరద్వాజ్ చెప్పారు. మంత్రుల అధికారిక మెయిల్ ఐడీలకు బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చాయని ఆయన శుక్రవారం తెలిపారు.
ఆ మెయిల్స్లో ‘మేము ఏం చేస్తామో మీరు అర్థం వేసుకోండి' అంటూ పేర్కొన్నారని డిజిపి తెలిపారు. బెదిరింపు మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు పంపారనే దానిపై దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. ఇంటెలిజెన్స్ సంస్థలతో కలిసి ఈ మెయిల్స్ పంపిన దుండగుల వివరాలు సేకరిస్తున్నాయని తెలిపారు.
ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులెవరైనా ఉద్దేశ్యపూర్వకంగా ఈ మెయిల్స్ పంపిస్తున్నారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని చెప్పారు. కేంద్ర సంస్థల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లను చేశామని చెప్పారు.
జనవరి 26న దాడులు తప్పవు : ఐఎం
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాదులు ఆరాచకం సృష్టించేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి 26న దాడులకు పాల్పడుతామని ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్(ఐఎం) హెచ్చరించింది. రాజస్థాన్లోని 16 మంది మంత్రులకు ఐఎం అధికారికంగా మెయిల్ చేసింది.
ఐఎం మెయిల్తో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రధాన పట్టణాల్లో పోలీసులు తనిఖీలు ప్రారంభించారు. అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.