మూడోది: సీఏఏ వ్యతిక తీర్మానానికి రాజస్థాన్ అసెంబ్లీ ఆమోదం
జైపూర్: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసిన రాష్ట్రాల జాబితాలో రాజస్థాన్ చేరిపోయింది. సీఏఏను రద్దు చేయాలంటూ తీసుకొచ్చిన తీర్మానానికి రాజస్థాన్ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు.
సభలో వెల్లోకి సీఏఏకు మద్దతుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు బీజేపీ సభ్యులు. కాగా, సీఏఏను రద్దు చేయాలనే తీర్మానానికి ఆమోదం తెలిపిన మూడో రాష్ట్రంగా రాజస్థాన్ నిలిచింది. ఇప్పటికే కేరళ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన తీర్మానాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే.
కేరళ అసెంబ్లీలో సీఏఏ రద్దు తీర్మానాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రవేశపెట్టగా.. ఒక్క బీజేపీ ఎమ్మెల్యే మినహా మిగితా సభ్యులంతా ఆమోద ముద్ర వేశారు. ఇక పంజాబ్ రాష్ట్రం కూడా సీఏఏ రద్దు తీర్మానాన్ని అసెంబ్లీలో తీసుకొచ్చి ఆమోద ముద్ర వేసింది.
కాగా, జనవరి 27న పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో కూడా సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇప్పటికే ప్రకటించారు. తొలి నుంచి కూడా సీఏఏను మమతా బెనర్జీ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ప్రధాని మోడీని కలిసిన సమయంలోనూ సీఏఏను వెనక్కి తీసుకోవాలని మమతా బెనర్జీ కోరారు.
కాంగ్రెస్, వామపక్షాలు, టీఎంసీ, శివసేన, ఎన్సీపీ, టీఆర్ఎస్ పార్టీలు సీఏఏను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలకు ఈ పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. తాజాగా టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా సీఏఏకు వ్యతిరేకంగా పోరాడుతామని అన్నారు. అవసరమైతే అసెంబ్లీలో తీర్మానం కూడా చేస్తామని తెలిపారు.
సీఏఏకు వ్యతిరేకంగా అనుకూల పార్టీలతో కలిసి చర్చిస్తామని, 10లక్షల మందితో భారీ సభను కూడా ఏర్పాటు చేస్తామని కేసీఆర్ చెప్పారు. సీఏఏ తీసుకురావడం తప్పు అని, ఎన్పీఆర్, ఎన్ఆర్సీలను కూడా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఎవరు వ్యతిరేకించినా సీఏఏను అమలు చేసి తీరుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేశారు.