బురదలోకి లాగొద్దు: రాజస్థాన్ రాజకీయ సంక్షోభంపై ఎట్టకేలకు స్పందించిన వసుంధర రాజే
జైపూర్: గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న రాజస్థాన్ రాజకీయ హైడ్రామాపై ఎట్టకేలకు ఆ రాష్ట మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత వసుంధర రాజే స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అసమ్మతికి రాస్ట్ర ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారని మండిపడ్డారు. ఆ పార్టీ వివాదాల్లో తనను, తమ పార్టీని లాగొద్దని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.
హోటల్ రాజకీయం: రాజస్థాన్ పోలీసులను అడ్డుకున్న హర్యానా పోలీసులు
కరోనావైరస్ కారణంగా రాష్ట్రంలో 500 మంది ప్రాణాలు కోల్పోయారని, దాదాపు 28వేల మంది కరోనా బాధితులున్నారని వసుంధర రాజే తెలిపారు. ఇక రాష్ట్రంలో మిడతల సమస్య కూడా ఉందన్నారు. అంతేగాక, రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని అన్నారు.
రాష్ట్ర ప్రజలు విద్యుత్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వసుంధర రాజే తెలిపారు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలతో ప్రజలు సతమవుతుంటే.. ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న సంక్షోభం వారిని మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ సంక్షోభం అనే బురదలోకి బీజేపీని లాగవద్దని రాజే అన్నారు. బీజీపీ నేతలను లాగాలనుకోవడంలో అర్థం లేదన్నారు. ప్రస్తుతం అనేక సమస్యలతో సతమతమవుతున్న ప్రజల గురించి ఆలోచించే ప్రయత్నం చేయాలని అధికార కాంగ్రెస్ పార్టీకి హితవు పలికారు.
ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్, ఆయన వర్గం తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, బీజేపీనే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు పన్నుతోందంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తమ పార్టీ నేతలను ప్రలోభపెట్టే ప్రయత్నాలను చేశారంటూ ఆడియో క్లిప్పులను కూడా విడుదల చేసింది.