రాజస్థాన్ సెంట్రల్ వర్సిటీలో స్కాలర్ ఆత్మహత్య
జైపూర్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల అత్మహత్య మరువక ముందే మరో రీసెర్చ్ స్కాలర్ ఆత్మహత్య చేసుకున్నాడు. రోహిత్ ఘటనపై దేశవ్యాప్త నిరసనలు జరుగుతుండగానే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్లో మరో స్కాలర్ ఆత్మహత్య ఇప్పుడు కలకలం రేపుతోంది.
సీనియర్ ప్రొఫెసర్ వేధింపులే విద్యార్థి ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని ప్రాథమిక సమాచారం. వివరాల్లోకి వెళితే, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్లో మోహిత్ చౌహాన్(27) అనే పీహెచ్డీ స్కాలర్ శుక్రవారం రాత్రి తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు వర్సిటీలోని విద్యార్ధి గది నుంచి పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే అందులో సూసైడ్ నోట్ ఉందా లేదా? అనే విషయాన్ని స్పష్టం చేయలేదు. ఈ ఘటనపై అజ్మీర్ ఐజీ మాలిని అగర్వాల్ మాట్లాడారు.
శుక్రవారం సాయంత్రం వరకు మోహిత్ హాస్టల్ స్నేహితులతో కలిసే ఉన్నాడని అన్నారు. వారితో ముచ్చటించిన అనంతరం తన గదికి వెళ్లిపోయాడు. తోటి స్నేహితులు రాత్రి భోజనానికి రమ్మని ఫోన్ కాల్ చేయగా లిఫ్ట్ చేయలేదు. దీంతో స్నేహితులు అతని గదికి వెళ్లి చూడగా ఉరివేసుకుని కనిపించాడు.
వెంటనే అతడిని కిందకు దించి ఆసుపత్రికి తరలించగా మోహిత్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పీహెచ్డీ స్కాలర్ మృతి చెందిన విషయం తెలియగానే వైస్ ఛాన్సలర్ ఆసుపత్రికి వెళ్లాడు. విద్యార్ధి ఆత్మహత్య బాధాకరమని పేర్కొన్నారు.
మరోవైపు శుక్రవారం రాత్రి స్నేహితుల మధ్య జరిగిన సంభాషణలపై విచారించాల్సి ఉందని ఐజీ పేర్కొన్నారు. పీహెచ్డీ స్కాలర్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే శనివారం యూనివర్సిటీని సందర్శించనున్నారు.