మళ్లీ తెరపై వలంటర్లీ గివెన్ అప్ అస్త్రం: వర్కవుట్పై డౌట్స్: ఫిరాయింపు నిరోధక చట్టంతో చెక్?
జైపూర్: రాజస్థాన్ రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. రోజులు గడిచే కొద్దీ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎత్తుకు పైఎత్తులు, వ్యూహ ప్రతివ్యూహాలతో రసవత్తరంగా తయారయ్యాయి. దేశవ్యాప్తంగా అన్నిరాజకీయ పార్టీలు, విశ్లేషకుల దృష్టిని ఆకర్షించాయి. ఓ పెద్ద రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీల మధ్య ఉత్కంఠభరితంగా నెలకొన్న రాజకీయ పోరులో అంతిమ విజయం ఎవరిది? అనే చర్చకు తావిచ్చాయి. రాజస్థాన్ రాజకీయ సంక్షోభంలో భారతీయ జనతా పార్టీ ఎక్కడా తెరమీదికి రావట్లేదు. అయినప్పటికీ.. చాప కింద నీరులా తన పని తాను చేసుకుని పోతోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
నియంత నోట..యుద్ధం మాట: సెకెండ్ కొరియన్ వార్: మా బలాలు అవే: జోలికి రావట్లేదు
సచిన్ పైలెట్ తిరుగుబాటుతో..
రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో యువనేతగా గుర్తింపు పొందిన సచిన్ పైలెట్ తిరుగుబాటు లేవదీయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అంచుల్లో నిలిచింది. చివరి నిమిషంలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన కుర్చీని కాపాడుకున్నారు. అయినప్పటికీ.. సంక్షోభానికి తెర పడలేదు. దీనికి కారణం- తిరుగుబాటు నేతగా ముద్రపడిన సచిన్ పైలెట్, ఆయనకు మద్దతు ఇస్తోన్న 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడమే. తమపై అనర్హత వేటు వేస్తూ స్పీకర్ సీపీ జోషి తీసుకున్న నిర్ణయాన్ని సచిన్ పైలెట్ హైకోర్టులో సవాలు చేయడంతో అసలు కథ ఆరంభమైంది.
హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో చుక్కెదురు..
సచిన్ పైలెట్పై వేసిన అనర్హత వేటును హైకోర్టు తప్పు పట్టింది. ఆయనపై ఎలాంటి చర్యలను తీసుకోకూడదని స్పష్టం చేసింది. దీన్ని సవాల్ చేస్తూ స్పీకర్ సీపీ జోషి దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. అనంతరం ఆయన సుప్రీంకోర్టు నుంచి తన పిటీషన్ను ఉపసంహరించుకున్నారు. అది వేరే విషయం.
టెన్త్ షెడ్యూల్ ప్రయోగం..
సచిన్ పైలెట్పై చర్యలు తీసుకోవాలనే బలమైన ఉద్దేశంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ తాజాగా టెన్త్ షెడ్యూల్ను ప్రయోగించాలని భావిస్తోంది. పార్టీ ఫిరాయింపులను నిరోధించడానికి ఉద్దేశించిన రాజ్యాంగంలోని షెడ్యూల్ ఇది. పార్టీ ఫిరాయించిన వారిపై ఈ షెడ్యూల్ కింద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ షెడ్యూల్ కింద శాసనసభ్యుడిని అనర్హుడిగా గుర్తించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి- వలంటర్లీ గివెన్ అప్ టు ద పార్టీ అంటే స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకోవడం, రెండు- విప్కు వ్యతిరేకంగా ప్రవర్తించడం లేదా సభలో ప్రతిపాదిత బిల్లులపై పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా ఓటు వేయడం.
ఈ రెండింటి ద్వారా చర్యలకు అవకాశం..
ఈ రెండు విధానాల ద్వారా సచిన్ పైలెట్పై చర్యలు తీసుకోవాలని అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తున్నట్లు చెబుతున్నారు. సంక్షోభం ఇలాగే మరి కొన్నిరోజులు కొనసాగే పరిస్థితే తలెత్తితే.. ఈ రెండింట్లో ఏదో ఒక మార్గాన్ని అనుసరించి.. సచిన్ పైలెట్, ఆయనకు మద్దతు ఇస్తోన్న ఎమ్మెల్యేలపై వేటు వేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. దీనికోసం మరోసారి న్యాయస్థానాలను కూడా ఆశ్రయించడానికి వెనుకాడకపోవచ్చని తెలుస్తోంది. పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడం అనే క్లాజ్ను ప్రయోగించాల్సి వస్తే.. తమకు మద్దతు ఇస్తోన్న బహుజన్ సమాజ్వాది పార్టీ ఎమ్మెల్యేలు ఇబ్బందులకు గురి కావచ్చని అంటున్నారు.
బీఎస్పీ ఎమ్మెల్యేల విలీనంపై..
రాజస్థాన్ అసెంబ్లీలో బీఎస్పీకి ఆరుమంది సభ్యుల బలం ఉంది. లఖన్ సింగ్, దీప్ చంద్, ఆర్ గుడ్హా, వజీబ్ అలీ, జేఎస్ అవానా, సందీప్ కుమార్ కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ ఇదివరకే పార్టీ అధినేత్రి మాయావతి ఆదేశించినప్పటికీ.. వారు పట్టించుకోలేదు. సచిన్ పైలెట్పై టెన్త్ షెడ్యూల్లోని రెండో క్లాజును ప్రయోగించాల్సి వస్తే.. అది బీఎస్పీ ఎమ్మెల్యేలకు కూడా వర్తించే అవకాశం ఉంది. ఇది కాస్తా అటు రాజ్యాంగం.. చట్టసభల మధ్య ఘర్షణకు దారి తీయవచ్చని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో విలీనమైనట్లు చెబుతున్నారు.
జాతీయ పార్టీకి ప్రాంతీయ స్థాయిలో విలీనంపై
బీఎస్పీ జాతీయ పార్టీ. అందులో అనుమానాలు అక్కర్లేదు. ఒక జాతీయ పార్టీ నుంచి చట్టసభలకు ఎన్నికైన సభ్యులు.. ప్రాంతీయ స్థాయిలో మరో రాజకీయ పార్టీలో విలీనం అయినట్లు ప్రకటించే అవకాశం లేదు. ఏ నిర్ణయమైనా జాతీయ స్థాయిలో తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి తమను కాంగ్రెస్ సభ్యులుగా గుర్తించాలంటూ ఆరుమంది బీఎస్పీ ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయగా.. దాన్ని కొట్టేశారు న్యాయమూర్తులు. ఒకరకంగా ఇదీ అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బగానే భావించాల్సి ఉంటుందని అంటున్నారు.
Recommended Video
జాతీయపార్టీ.. జాతీయ స్థాయిలో విలీనం..
గవర్నర్ కల్రాజ్ మిశ్రా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బీఎస్పీ జాతీయ పార్టీ అయినందున ప్రాంతీయ స్థాయిలో సొంతంగా ఆ పార్టీకి చెందిన నేతలు గానీ, ఎమ్మెల్యేలు గానీ ఎలాంటి నిర్ణయాలను తీసుకోలేరంటూ కల్రాజ్ మిశ్రా స్పష్టం చేశారు. టెన్త్ షెడ్యూల్ ప్రకారం.. ఆ అవకాశం ఉందంటూ కాంగ్రెస్ వాదిస్తోంది. ఇదే వాదనలను కాంగ్రెస్ తరఫు న్యాయవాది సునీల్ ఫెర్నాండెజ్ హైకోర్టులో తన వాదనలను వినిపించారు. గత ఏడాది సెప్టెంబర్లోనే బీఎస్పీకి చెందిన ఆరుమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో విలీనమైనట్లు ప్రకటించారని, ఇప్పుడు అది చెల్లదంటూ పార్టీ అగ్ర నాయకత్వం ఎలా చెప్పగలుగుతుందని ప్రశ్నిస్తున్నారు.